తమిళనాడులో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలపై నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడిన సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని సంస్థలు డీఎంకేనే అధికారంలోకి వస్తుందని చెప్పగా, మరికొన్ని సంస్థలు అన్నాడీఎంకే, ఇంకొన్ని టీవీకే కింగ్ మేకర్ గా మారుతుందని వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే సమావేశం అయింది. నాలుగు రోజుల పాటు కొడైకెనాల్ లో వేసవి సెలవులు గడిపిన సీఎం నిన్న సాయంత్రమే రాజధానికి తిరిగి వచ్చారు. ఎగ్జిట్ పోల్స్ నేతృత్వంలో ఆయన ఉన్నత స్థాయి నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, ఎంఆర్కే పన్నీర్సెల్వం, ఈవీ వేలు తదితర మంత్రులు పాల్గొన్నారు.
మే 4న ఓట్ల లెక్కింపు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరగనున్నందున, స్టాలిన్ వ్యూహాన్ని ఖరారు చేయడంపైనా, ఓట్ల లెక్కింపును పర్యవేక్షించనున్న పార్టీ బూత్ ఏజెంట్లకు సూచనలు ఇవ్వడంపైనా దృష్టి సారించారని డీఎంకే వర్గాలు తెలిపాయి. ప్రతి ఓటును సరిగ్గా లెక్కించేలా చూసేందుకు లెక్కింపు ప్రక్రియలో అప్రమత్తత ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 23న జరిగాయి. మే 4న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
టీవీకే నేతలతో సమావేశం..
ఎన్నికల ఫలితాలపై టీవీకే నేతలతో విజయ్ కూడా సమావేశం అయ్యారు. కొన్ని సర్వే సంస్థలు విజయ్ కింగ్ మేకర్ అవుతారని అంచనా వేయడంతో ఆయన తన పార్టీ అభ్యర్థులతో సమావేశం అయ్యారు. హంగ్ ఏర్పడితే అనుసరించే వ్యూహం గురించి చర్చించినట్లు సమాచారం.

