బండి భగీరథ్ కు బెయిల్ ఇవ్వాలా వద్దా అనే విషయమై సస్పెన్స్ కంటిన్యు అవుతోంది. ఈనెల 8వ తేదీన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే.
తనపైన భగీరథ్ లైంగిక దాడిచేశాడని, బలవంతంగా మద్యం, డ్రగ్స్ ఇచ్చాడని ఒక అమ్మాయి అందులోను మైనర్ ఫిర్యాదుచేసింది. దాంతో భగీరథ్ పై పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. అప్పటి నుండి పరారీలో ఉన్న భగీరథ్ ను అరెస్టుచేసేందుకు పోలీసులు నాలుగు బృందాలుగా వెతుకుతున్నారు. తనను ఎప్పుడైనా అరెస్టుచేసే అవకాశం ఉందని గ్రహించిన భగీరథ్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ వేశాడు.
బెయిల్ పిటీషన్ పై గురువారం విచారించిన జడ్జీ కేసును వచ్చే వారానికి వాయిదా వేశారు. ఎందుకంటే తన క్లయింట్ మీద ఫిర్యాదుచేసిన బాలిక మైనర్ కాదని భగీరథ్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. బాలికకు రెండు బర్త్ సర్టిఫికేట్లున్నాయని, తమకున్న సమాచారం ప్రకారం సదరు బాలిక మేజర్ అని లాయర్ వాదించారు. దాంతో బాలిక వయసును తెలిపే వివరాలను శుక్రవారం కోర్టుకు అందించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను జడ్జి ఆదేశించారు. బాలిక వివరాలను పరిశీలించిన తర్వాత బెయిల్ ఇవ్వాలా వద్దా అనే విషయమై నిర్ణయం తీసుకునేందుకు కేసును వచ్చే వారానికి జడ్జి వాయిదావేశారు.

