బండి సంజయ్పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలుచేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైతే తండ్రి బండి సంజయ్ కేంద్రమంత్రిగా ఎందుకు రాజీనామా చేయాలని మీడియాను ఎదురు ప్రశ్నించారు.
సంజయ్ ఎలాంటి తప్పుచేయనపుడు కేంద్రమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయాలని అడిగారు. సంజయ్ ఏదన్నా తప్పుచేసుంటే పార్టీ కచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది అన్నారు. ఇక భగీరథ్ గురించి మాట్లాడుతు ముందస్తు బెయిల్ తీసుకోవటం తన హక్కు అని తేల్చేశారు. భగీరథ్ ఎక్కడకూ పారిపోలేదు, బెయిల్ అప్లికేషన్ కోర్టులో పెండింగులో ఉందన్న విషయాన్ని రామచంద్రరావు గుర్తుచేశారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత జైలుకు వెళితే కేసీఆర్, కేటీఆర్ తమ పదవులకు రాజీనామాలు చేశారా అని సూటిగా అడిగారు. కోట్ల రూపాయలు ఖర్చులుచేసి భగీరథ్, సంజయ్ కు వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపోయారు. బీఆర్ఎస్ నేతలకు ఏపనీ లేనట్లుగా భగీరథ్ కుటుంబాన్ని టార్గెట్ చేయటం సరికాదన్నారు. కేవలం సంజయ్ కోసమనే కొడుకును బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో బీఆర్ఎస్ ముందుగానే కోర్టులో ఎందుకు కేసు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ముందస్తుగా కోర్టుకు వెళ్ళలేదా అని నిలదీశారు.
బీఆర్ఎస్ హయాంలో మహిళలపై దాడులు జరిగినట్లు చెప్పారు. పబ్ లో ఎంఐఎం నేత కొడుకు అత్యాచారం చేయలేదా ? అని ప్రశ్నించారు. పై రెండు కేసుల్లోను అప్పట్లో బీఆర్ఎస్ ఏమిచేసిందో చెప్పాలన్నారు. కొమురంభీం జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగితే అప్పటి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో లంబాడా అమ్మాయి కస్టడీ డెత్ అవలేదా అని అడిగారు. గతంలో జరిగిన అత్యాచారాలకు బాధ్యత వహించి కేసీఆర్ రాజీనామా చేశారా ? అని నిలదీశారు. కాళేశ్వరం, కారు రేసు కేసులో త్వరగా విచారణ జరిగేలా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. మోదీ సభ తర్వాత జనాలంతా బీజేపీ వైపు చూస్తున్న సమయంలో బీఆర్ఎస్ ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని రామచంద్రరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

