కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ టార్గెట్గా సెకండ్ స్టేజ్ మొదలైనట్లే ఉంది. లైంగిక దాడికి సంబంధించిన ఒక మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బండి భగీరథ్ పై ఈనెల 8వ తేదీన పేట్ బషీరా బాద్ పోలీసులు పోక్సో కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే.
మామూలుగా అయితే పోక్సో కేసు నమోదుకాగానే పోలీసులు ముందుచేసే పనేమిటంటే సదరు వ్యక్తిని అరెస్టుచేయటం. పోక్సో కేసులో కీలకమైన పాయింట్ ఏమిటంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ రావాలంటే ముందు అరెస్టవ్వాల్సిందే. అరెస్టు కాకుండా ఏ కోర్టు కూడా సదరు వ్యక్తికి బెయిల్ ఇవ్వదు కాక ఇవ్వదు. అందుకనే ఈకేసులో భగీరథ్ తాను అరెస్టుకాకుండా ముందస్తు బెయిల్ లేదా మధ్యంతర బెయిల్ అంటూ వారంరోజులు పోలీసుల నుండి తప్పించుకుని తిరిగాడు.
నిందితుడి తరపు లాయర్లు ముందస్తు బెయిల్ కోసం ఎంతప్రయత్నించినా సాధ్యంకాలేదు. హైడ్రామా మధ్య పేట్ బషీరా బాద్ పోలీస్టేషన్లో నిందితుడు ప్రత్యక్షమయ్యాడు. తానే కొడుకును పోలీసులకు సరెండర్ చేశానని సంజయ్ చెబితే అదేమీలేదు తామే నిందితుడిని అరెస్టుచేశామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేష్ రెడ్డి ప్రకటించారు. కాబట్టి భగీరథ్ అరెస్టయ్యాడా ? లేకపోతే లొంగిపోయాడా అనే విషయంలో క్లారిటిలేదు.
సరే, ఇపుడు విషయం ఏమిటంటే నిందితుడి అరెస్టుతో మొదటి స్టేజ్ ముగిసినట్లే. ఇపుడు మొదలైన రెండో స్టేజ్ ఏమిటంటే బండి సంజయ్ మంత్రిపదవిని ఊడబీకటం. నిందితుడి తండ్రి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కాబట్టి విచారణ సక్రమంగా జరగదని, బాధితురాలికి సరైన న్యాయం జరగదని తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. బాధితురాలికి సరైన న్యాయం జరగాలంటే వెంటనే బండి సంజయ్ ను కేంద్రమంత్రివర్గంలో నుండి తప్పించాలని కవిత డిమాండ్ చేశారు. అలాగే బాధితురాలి తరపున హైకోర్టులో వాదనలు వినిపించిన లాయర్ పప్పు నాగేశ్వరరావు కూడా నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
అధికార పలుకుబడితో వ్యవస్ధలను ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్న బండి సంజయ్ ను మంత్రిపదవి నుండి తొలగించాలని మోదీకి పప్పు లేఖ రాసారని ప్రచారం జరుగుతోంది. బండి కేంద్రమంత్రి పదవిలో ఉంటే కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారని లాయర్ ఆందోళన వ్యక్తంచేశారు. బండి లాంటి వ్యక్తులు అధికార పదవుల్లో ఉంటే బాధితురాలికి న్యాయం జరిగే అవకాశాలపై ప్రభావం పడుతుందని చెప్పారు. కాబట్టి విచారణ పూర్తయ్యేవరకు బండిని మంత్రి పదవినుండి తప్పించాలని లేఖలో పప్పు అభ్యర్ధించినట్లు సమాచారం.
ఇంతమంది కేంద్రమంత్రివర్గం నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారంటే అది బండి చేసుకున్న స్వయంకృతమనే చెప్పాలి. ఎప్పుడైతే కొడుకు మీద పోక్సో కేసు నమోదయ్యిందో వెంటనే కొడుకును పోలీసులకు అప్పగించుండాల్సింది. కొడుకును అప్పగించుంటే సంజయ్ టార్గెట్ గా రాజకీయ వివాదం ముదిరి ఉండేదికాదు. పోక్సో కేసు నమోదైతే ముందస్తుబెయిల్ రాదన్న విషయం కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కు తెలియకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. పుత్రప్రేమతో భగీరథ్ ను అరెస్టుకాకుండా రక్షించుకునేందుకు సంజయ్ ప్రయత్నంచేసి సాధ్యంకాకపోవటంతోనే సరెండర్ డ్రామాలాడారు అన్న ఆరోపణలు తప్పేవి. మైనర్ బాలిక విషయంలో కొడుకు భగీరథ్ తప్పుచేస్తే కొడుకు చేసిన తప్పును వెనకేసుకొచ్చి తండ్రిగా సంజయ్ తప్పచేయటం వల్లే ఇపుడు ఇద్దరూ సమస్యల్లో ఇరుక్కున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదే పద్దతిలో బండిని మంత్రిపదవిలోనుండి తప్పించాలని మోదీకి ఇంకెంతమంది లేఖలు రాయబోతున్నారో చూడాలి.

