మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు సోమవారం భారత్లో కొంతసేపు అంతరాయానికి గురయ్యాయి. ముఖ్యంగా దక్షిణ భారతానికి చెందిన పలువురు వినియోగదారులు దాదాపు 24 గంటల పాటు కొన్ని ఫీచర్లను ఉపయోగించలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ సమస్యపై బాధితులు సోషల్ మీడియా వేదికగా తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
వినియోగదారుల ఫిర్యాదులపై స్పందించిన వాట్సాప్ ప్రతినిధి, సేవలను దుర్వినియోగం చేసే ప్రయత్నాలను అరికట్టేందుకు అనుమానాస్పద ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేస్తామని తెలిపారు. వినియోగదారుల భద్రత కోసం ఇలాంటి చర్యలు అవసరమవుతాయని, అయితే కొన్నిసార్లు పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో ప్రభావిత ఖాతాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పలువురు వినియోగదారుల ఖాతాలు సమీక్షలో ఉన్నట్లు సందేశాలు కనిపించాయి.
యాప్లో కనిపించిన సందేశం ప్రకారం, "మీ ఖాతా కార్యకలాపాలు, పరికర సమాచారం సేవా నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నాం. సాధారణంగా 24 గంటల్లో సమీక్ష పూర్తవుతుంది" అని పేర్కొంది. అలాగే, "వాట్సాప్ను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలి", "దొంగిలించబడిన ఫోన్ లేదా ఖాతాల గురించి" వంటి సహాయ ఎంపికలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.
ఈ ఘటనపై పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో స్పందించారు. ఎలాంటి కారణం తెలియజేయకుండా తమ ఖాతాలు నిలిపివేశారని, అప్పీల్ చేసినప్పటికీ 24 గంటల్లో సమీక్ష పూర్తవుతుందని మాత్రమే సందేశం వస్తోందని కొందరు పేర్కొన్నారు.
మరో వినియోగదారు తన పని పూర్తిగా వాట్సాప్పైనే ఆధారపడి ఉందని, అధికారిక యాప్ను మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ ఎలాంటి హెచ్చరిక లేకుండానే ఖాతా నిలిపివేయబడిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

