హార్ముజ్ జలసంధిలో కార్గో షిప్పులకు రక్షణగా వస్తున్న అమెరికా నేవీపై దాడి జరిగితే ఇరాన్ ను భూమి మీదే లేకుండా తుడిచిపెట్టేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం.. యూఎస్ నేవీ చేపట్టిన 'ఆపరేషన్ ఫ్రీడమ్' కింద చమురు నౌకలకు ఎస్కార్ట్ కల్పిస్తున్నారు. అయితే వీటిపై ఇరాన్ దాడులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫాక్స్ న్యూస్ తో ట్రంప్ మాట్లాడారు.
ఫిబ్రవరి 28న ఇరాన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపుగా మూసివేయబడిన ఈ జలసంధిలో అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియాకు చమురు రవాణా జరుగుతోంది. అయితే ఇందుకు రక్షణ గా ఉన్న అమెరికా నౌకలపై ఇరాన్ స్పీడ్ బోట్లతో దాడి చేస్తోందని ట్రంప్ ట్రూత్ సోషల్ లో ఆరోపించారు."నౌకల కదలిక, ప్రాజెక్ట్ ఫ్రీడమ్ విషయంలో, దక్షిణ కొరియా సరుకు రవాణా నౌకతో సహా సంబంధం లేని దేశాలపై ఇరాన్ కొన్ని దాడులు చేసింది. బహుశా దక్షిణ కొరియా వచ్చి ఈ మిషన్లో చేరాల్సిన సమయం ఆసన్నమైంది" అని ట్రంప్ అన్నారు. అమెరికా దళాలు ఏడు చిన్న పడవలను కూల్చివేశాయని, హార్ముజ్ జలసంధిలోని ఈ మిషన్లో చేరాలని దక్షిణ కొరియాను ఆయన కోరారు. "మేము ఏడు చిన్న పడవలను కూల్చివేశాము. వారి వద్ద మిగిలి ఉన్నవి అవే. దక్షిణ కొరియా నౌక మినహా, ఈ క్షణం వరకు జలసంధి గుండా వెళుతున్న మరే ఇతర నౌకకు నష్టం జరగలేదు. యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కెయిన్ రేపు (మంగళవారం) ఉదయం విలేకరుల సమావేశం నిర్వహిస్తారు" అని అధ్యక్షుడు తెలిపారు.ఆ ప్రాంతంలో అమెరికా సైనిక సమీకరణ కొనసాగుతోందని అధ్యక్షుడు ఫాక్స్ న్యూస్తో చెప్పారు. "గతంలో కంటే ఇప్పుడు మన వద్ద చాలా ఉన్నత శ్రేణికి చెందిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయి" అని ట్రంప్ అన్నారు. "మా వద్ద అత్యుత్తమ పరికరాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మా సామాగ్రి ఉంది. ప్రపంచవ్యాప్తంగా మాకు స్థావరాలు ఉన్నాయి. అవన్నీ పరికరాలతో నిండి ఉన్నాయి. అవసరమైతే, మేము ఆ సామాగ్రి అంతటినీ ఉపయోగించగలము.. ఉపయోగిస్తాము కూడా" అని ట్రంప్ అన్నారు.

