తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నాడు. ఇందులో ప్రధాన భాగస్వామిగా కాంగ్రెస్ ఉంది. అయితే ఆయన ఈ మధ్య రహస్యంగా అర్థరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలుసుకున్నారు.
ఇది కొత్త అనుమానాలకు తావిస్తోంది.
ఆగష్టు 20న మహాబలిపురంలో 31వ దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముందు రహస్యంగా ఈ ఇద్దరు నాయకులు కలుసుకున్నారు. ఇది కేంద్రం ప్రవేశ పెట్టనున్న డీలిమిటేషన్ కు విజయ్ తన మద్దతును ప్రకటించబోతున్నారా అనే ప్రశ్నను లేవనెత్తింది.అమిత్ షా చెన్నై పర్యటనను కాంగ్రెస్ నిరసించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే టీవీకే మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇంతకుముందు డీఎంకే- కాంగ్రెస్ పాలనలో వారు మూకుమ్మడిగా కేంద్రంపై దాడి చేసేవారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి మాత్రం కనిపించలేదు.ఆ రోజుల్లో ఈ రెండు మిత్రపక్షాలు, రాష్ట్రంలో పర్యటించే ఏ బీజేపీ నాయకుడికైనా వ్యతిరేకంగా యథావిధిగా కలిసికట్టుగా వ్యవహరించేవి - ప్రధానమంత్రి లేదా హోం మంత్రి రాష్ట్రంలో అడుగుపెట్టిన ప్రతిసారీ "గో బ్యాక్ మోదీ" అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండింగ్గా మార్చేవి. ఈసారి ఆ ఉమ్మడి శక్తి ప్రదర్శన స్పష్టంగా కనబడలేదు.
విజయ్ మనసు మార్చుకున్నాడా?
రాత్రి 8 గంటల తర్వాత విజయ్ ఏ కార్యక్రమానికి హాజరుకారని సీనియర్ జర్నలిస్ట్ ప్రియన్ అన్నారు. అయినప్పటికీ, హోం మంత్రికి స్వాగతం పలకడానికి ఆయన రాత్రి 10 గంటల ప్రాంతంలో స్వయంగా వెళ్లారు. "అదే అనుమానాలను రేకెత్తించింది" అని ప్రియన్ అన్నారు. షా సమక్షంలో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి కూడా నియోజకవర్గాల పునర్విభజనపై తన వైఖరిని మృదువుగా మార్చుకున్నట్లు కనిపించారని ఆయన తెలిపారు.టీవీకే ప్రభుత్వం మౌనం వహించిన అనేక అంశాలను ప్రియన్ ప్రస్తావించారు. తమిళనాడు ఇప్పటికీ విద్యా సంబంధిత నిధుల కోసం ఎదురుచూస్తోంది. 2024-25 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ఉన్న రూ. 2,151 కోట్ల సమగ్ర శిక్షా నిధులను నిలిపివేసింది. అలాగే కేంద్రం తీసుకొచ్చిన అనేక సవరణలు రాష్ట్రాల హక్కులు హరించాయి.ఇటీవలి ఖనిజ చట్ట సవరణలు రాష్ట్రాల హక్కులను దెబ్బతీశాయి. విజయ్ వీటిలో దేనినీ బహిరంగంగా విమర్శించలేదు. "ఆయన బీజేపీని సైద్ధాంతిక శత్రువు అని చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలో దానిని బలంగా చూపించలేదు. ఆయన మౌనం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది" అని ప్రియన్ అన్నారు.కాంగ్రెస్ ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తోందని ప్రియన్ ఇంకా అన్నారు. "ఇటీవల రాహుల్ గాంధీ చెన్నై పర్యటనకు వచ్చినప్పుడు, విజయ్ ఆయనను వ్యక్తిగతంగా కలవలేదు. అంతకుముందు, రాహుల్తో కలిసి ఢిల్లీలో తన పార్లమెంటరీ ప్రసంగాల పుస్తకావిష్కరణకు ఎండిఎంకె నాయకుడు వైకో విజయ్ను ఆహ్వానించారు.జనసమూహం, భద్రతా కారణాలు చూపుతూ విజయ్ దూరంగా ఉన్నారు. ఇండి కూటమి తమిళనాడు విభాగానికి బాధ్యతలు స్వీకరించాలని మిత్రపక్షాల సమావేశం విజయ్ను కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు.ఈ కూటమి ఇంకా ఒక ఉమ్మడి పేరును కూడా ఖరారు చేయలేదు. తదుపరి సమావేశాలు కూడా నిర్వహించలేదు. కేంద్రం ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకే టీవీకే ఇండి కూటమికి దూరంగా ఉంటోందని చాలామంది భావిస్తున్నారు" అని ఆయన అన్నారు.
ఎవరిని నొప్పించని రాజకీయాలు..
రాజకీయ పరిశీలకుడు, రచయిత కన్నన్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "ఎన్నికలకు ముందు అంతా ఒక ప్రేమకథ తొలిరోజుల్లా ఉంటుంది. ఎన్నికల తర్వాతే అసలైన వైవాహిక జీవితం మొదలవుతుంది. విజయ్ ఇప్పుడు నిజమైన రాజకీయాలు నేర్చుకుంటున్నారు" అని ఆయన అన్నారు.బీజేపీతో ఎలాంటి పొత్తు లేదా అవగాహనకు సంబంధించిన సూచనలు ఆయనకు కనిపించలేదు. "హోం మంత్రిని వ్యక్తిగతంగా స్వాగతించడం కేవలం సద్భావన చూపించే ఒక మార్గం మాత్రమే. ఒక్క సమావేశంతో వైఖరిలో పెద్ద మార్పు రాదు. మనం వేచి చూడాలి. ఒకప్పుడు ఎంజీఆర్ కేంద్రంతో ఎలాగైతే మితవాద రాజకీయాలు చేశారో, విజయ్ కూడా అలాగే చేస్తున్నారు. బహిరంగ ఘర్షణ కరుణానిధి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులనే తెస్తుంది."
కాంగ్రెస్ స్పందన
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గోపన్న మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి తాను నిర్వహిస్తున్న కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రిని స్వాగతించడం సాధారణమే. దీనికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య సంబంధాలు వేరు. పార్టీ బంధాలు వేరు. విజయ్ సిద్ధాంతం స్పష్టం. ఆయన అంబేద్కర్, పెరియార్లను తన నాయకులుగా అంగీకరించారు.కాంగ్రెస్-టీవీకే పొత్తులో ఎలాంటి గందరగోళం లేదు." షాకు వ్యతిరేకంగా జరిగిన కాంగ్రెస్ నిరసనలో టీవీకే ఎందుకు పాల్గొనలేదని అడిగినప్పుడు, ఆయన మాట్లాడుతూ.. ఆ పార్టీ ఇండి బ్లాక్లో చేరలేదని, ప్రస్తుతానికి అలా చేసే ఆసక్తి కూడా లేదని తేల్చి చెప్పారు.

