బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలపై హైకోర్టులో విచారణలో ఒక విషయం స్పష్టమైపోయింది. అదేమిటంటే ఫిరాయింపు ఎంఎల్ఏలను తిరిగి పార్టీలోకి వచ్చేట్లు చేయటంలో పార్టీ నాయకత్వం ఫెయిలైందని.
బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పదిమంది కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన విషయం అందరికీ తెలిసిందే.
ఈ పదిమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కండువాలను కప్పుకున్న విషయం అందరు చూసిందే. తాము అధికారంలో ఉన్నపుడు ఫిరాయింపులను విపరీతంగా ప్రోత్సహించిన కేసీఆర్ తమ పార్టీలో నుండి పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించటాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకనే వీరందరిపైనా అనర్హత వేటు వేయించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంతగా ప్రయత్నిస్తున్నా సాధ్యంకావటంలేదు.
కేసు విచారణ సందర్భంగా హైకోర్టు బీఆర్ఎస్ పార్టీని సూటిగా అడిగిన ప్రశ్నలతో నాయకత్వం వ్యూహం ఫలించలేదని అర్ధమైపోయింది. నాయకత్వం వ్యూహం ఏమిటంటే కోర్టు కేసులు, అనర్హత పేరుతో ఫిరాయింపులపై ఒత్తిడి తీసుకొచ్చి తిరిగి వారందరినీ తమదారిలోకి తీసుకొచ్చుకోవాలని. అయితే కోర్టులో కేసులు వేసేముందు పార్టీ పరంగా ఫిరాయింపులపై చర్యలకు నాయకత్వం ఏమైనా ప్రయత్నాలు చేసిందా అని ప్రశ్నించింది.
ఈ ప్రశ్నతోనే బీఆర్ఎస్ ఇబ్బందిపడింది. ఎందుకంటే ఫిరాయింపు ఎంఎల్ఏల మీద నాయకత్వం పార్టీ పరంగా తీసుకున్న చర్యలు ఏమీ లేవని అర్ధమవుతోంది. ఫిరాయింపులపై అనర్హత వేటు కేసులో చివరకు హైకోర్టు ఏమి తేలుస్తుందో చూడాల్సిందే.

