గోల్డెన్ తీఫ్ గా పాపులరైన సుభోద్ సింగ్ గ్యాంగులో కొందరిని కరీంనగర్ పోలీసులు అరెస్టుచేశారు. ఈ విషయాన్ని కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలం ఖాన్ గురువారం చెప్పారు.
నగరంలో ఈమధ్యనే ఒక జువెలరీ షాపులో భారీఎత్తున బంగారం, వజ్రాల నగలు చోరి అయిన విషయం తెలిసిందే. వ్యాపారం జరుగుతున్న సమయంలో సడెన్ గా కొందరు ముసుగులు ధరించిన దుండగులు షాపులోకి చొరబడి తుపాకులతో బెదిరించి అందినంత బంగారం, వజ్రాల నగలను దోచుకుని పారిపోవటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తుపాకులతో బెదిరించి కొందరిని కాల్చి నగలను దోచుకోవటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి. అందుకనే దోపిడీకి పాల్పడిందో ఎవరో అర్ధంకాక పోలీసులు నానా అవస్తలు పడ్డారు.
జరిగిన దోపిడీ కొత్త తరహా కావటంతో ఎవరి పనో పోలీసులకు అర్ధంకాలేదు. దోపిడీ జరిగిన విధానాన్ని పొరుగురాష్ట్రాలకు మన పోలీసులు సమాచారాన్ని అందించారు. దర్యాప్తులో జార్ఖండ్, పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో ఇలాంటి గ్యాంగులున్నట్లు తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా పొరుగురాష్ట్రాల్లోని పోలీసులు కొందరిని గుర్తించారు. దోపిడీకి పాల్పడింది సుభోద్ సింగ్ గ్యాంగ్ అని అతనిని గోల్డెన్ తీఫ్ అంటారని కూడా తెలుసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జరిగాసింగ్ అని కూడా తెలిసింది.
దోపిడి ముఠా వివరాలు తెలియగానే కరీంనగర్ పోలీసులు బృందాలుగా విడిపోయి వెతకటం మొదలుపెట్టారు. జార్ఖండ్, పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లోని మెహతాబ్ అనే ప్రాంతంలో ఈ ముఠా సెల్ ఫోన్, సిమ్ములు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. వాటి ఆధారంగా కరీంనగర్ పోలీసులు దోపిడీ ముఠాలోని ప్రధాన నిందుతుడు కర్మాకర్ తో పాటు మరికొందరిని పట్టుకున్నారు. షాపులో 161.4 తులాల బంగారు, వజ్రాల నగల దొంగతనం జరిగింది. వీటి విలువ రు. 82 లక్షలుంటుంది. ఈ ముఠా ఉత్తరాధి రాష్ట్రాల్లో దోపిడీలు కష్టమని భావించి మొదటిసారి తెలంగాణలోకి అడుగుపెట్టినట్లు కమిషనర్ తెలిపారు.
ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్ పట్టణాల్లోని బంగారు షాపుల్లో దొంగతనం చేసేందుకు రెక్కీ చేసింది. నాలుగు షాపుల్లో రెక్కీ చేసిన తర్వాత కరీంనగర్ లోని షాపులో దోపిడీ చేయటం తేలిక అని అర్ధమై ఇక్కడే దోపిడీ చేశారు. ఈ దోపిడీలో పాల్గొన్న ప్రద్యుమన్, మహతాబ్ ఖాన్ ను కూడా అరెస్టుచేశారు. వీరి దగ్గర నికిలీ ఆధార్ కార్డులు, నకిలీ బైక్ నెంబర్లు, నకిలీ పేర్లతో తిరుగుతు బంగారం షాపులను గమనిస్తుంటారు. రెండు నెలలుగా తెలంగాణలోనే క్యాంపు వేసిన ఈ ముఠా చివరకు కరీంనగర్ లో తమ పనికానిచ్చేసింది.

