కవిత కొత్త పార్టీ పేరును జాతీయ ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. కవిత పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా ఎన్నికల సంఘం ధ్రువీకరించింది. ఏప్రిల్ 25న కవిత తన నూతన పార్టీ పేరును ప్రకటించింది.
అప్పుడే తన పార్టీ పేరు టీఆర్ఎస్ అని వెల్లడించింది. కాగా అధికారిక ఆమోదం కోసం జాతీయ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోగా.. అన్ని అంశాలను పరిశీలించిన అధికారులు ఏప్రిల్ 30 బుధవారం రోజును పార్టీ పేరుకు ఆమోద ముద్ర వేశారు. ఈనెల 25న మేడ్చల్ లోని అద్వయ కన్వేషన్ లో టీఆర్ఎస్ పార్టీ పేరు ప్రకటించారు. తెలంగాణ రక్షణ సేన పేరును ఆమోదిస్తూ.. బంజారాహిల్స్లోని నివాసంలో కవితకు అధికారులు లేఖ అందించారు.
ఈ సందర్భంగానే తన ఎక్స్ ఖాతాలో కవిత మరోసారి తన హామీలను వివరించారు. పలు డిమాండ్లు కూడా చేశారు కవిత. ''2 నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తరవాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీని మర్చిపోయింది. గత ప్రభుత్వం ఇచ్చిన పదేళ్ల వయస్సు సడలింపును మరో రెండేళ్లు పెంచి మేం నిరుద్యోగులకు మేలు చేస్తున్నట్లు జీవో 30 ని 2024 ఫిబ్రవరి 8వ తేదీన జారీ చేసి...రెండేళ్లు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగ వయో పరిమితి 44 ఏళ్ల నుండి 46 ఏళ్లకు పెరిగింది. కానీ రెండున్నరేళ్లు గడిచినా... ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు'' అని ప్రశ్నించారు.
''ఆ జీవో వయస్సు సడలింపు పీరియడ్ ముగియగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 18 నుండి 34 ఏళ్ల వయస్సును అర్హతగా పేర్కొన్నారు. ఇది దుర్మార్గం. ఓ చేయితో ఇచ్చినట్లే ఇచ్చి మరో చేయితో లాగేసుకున్న చందంగా ఉంది మీ ప్రభుత్వం నిర్వాకం. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన నిరుద్యోగుల జీవితాలను అగం చేస్తే ఊరుకునేది లేదు'' అని హెచ్చరించారు.
''అలాంటి నిర్ణయాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 20న జారీ చేసిన 01/OG/PC/2026 నోటిఫికేషన్ ను రద్దు చేయించి... ఎలాంటి పరిమితులు లేకుండా జీవో 30ని అమలు చేయాలని నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలొ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం'' అని హెచ్చరించారు.

