Dailyhunt
కేరళలో యూడీఎఫ్ జోరు.. గాంధీభవన్‌లో ఘనంగా సంబరాలు

కేరళలో యూడీఎఫ్ జోరు.. గాంధీభవన్‌లో ఘనంగా సంబరాలు

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్న వేళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

ముఖ్యంగా హైదరాబాద్ గాంధీభవన్ వద్ద కార్యకర్తలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ పార్టీ విజయాన్ని ముందుగానే సెలబ్రేట్ చేశారు. ఓట్ల లెక్కింపు ముందుకు సాగుతున్న కొద్దీ యూడీఎఫ్ ఆధిక్యం మరింత బలపడుతోంది.

తాజా ధోరణుల ప్రకారం, 140 సీట్ల కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ 100కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. ఇది స్పష్టమైన మెజారిటీని దాటిన స్థితి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు దాదాపు ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక అధికార ఎల్డీఎఫ్ కూటమి గట్టి ఎదురుదెబ్బను ఎదుర్కొంటోంది. 40కి లోపు సీట్లలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. పలువురు మంత్రులు, కీలక నేతలు తమ నియోజకవర్గాల్లో వెనుకబడినట్లు ప్రారంభ ధోరణులు తెలిపాయి.

అయితే కొన్ని చోట్ల పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన ప్రచారం చేసిన కొన్ని కీలక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మంచి స్పందన లభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది యూడీఎఫ్ ఆధిక్యానికి ఒక కారణంగా కూడా భావిస్తున్నారు. గాంధీభవన్ వద్ద కార్యకర్తలు "కాంగ్రెస్ జిందాబాద్" నినాదాలతో హోరెత్తించారు. నేతలు, కార్యకర్తలు ఒకరినొకరు అభినందించుకుంటూ ఉత్సాహంగా కనిపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA