ఫార్ములా కార్ రేస్ కేసులో మాజీమంత్రి కేటీఆర్ కు ఏసీబీ కోర్టు షాకిచ్చింది. జూలై 31వ తేదీన విచారణకు కోర్టులో హాజరవ్వాలని గురువారం జారీచేసిన నోటీసులో స్పష్టంచేసింది.
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించాలని అనుకున్న ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతి, అధికార దుర్వినియోగం జరిగిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరిపించిన విచారణలో తేలింది. ఫార్ములా కార్ రేసులో అవినీతి ఆరోపణలపై ఏసీబీ, ఈడీలు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్ ప్రముఖ పాత్ర కాబట్టి ఏసీబీ తనను ఏ1గా కేసు పెట్టింది.
అలాగే అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను ఏ2గా అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా కేసులు నమోదు చేసింది ఏసీబీ. స్పోర్ట్స్ కన్సెల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావుపై ఏసీబీ ఏ4గా కేసు పెట్టింది. కేటీఆర్ ను ఏసీబీ ప్రాసిక్యూట్ చేయటానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉన్నపుడే అనుమతి లభించింది. వీళ్ళందరిపై దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో చార్జిషీటును దాఖలుచేశారు. చార్జిషీటును పరిశీలించిన కోర్టు వీరందరినీ జూలై 31న మొదలయ్యే విచారణకు హాజరుకావాలని ఈరోజు నోటీసులు జారీచేసింది. అధికార దుర్వినియోగం చేసి బ్రిటన్ లోని ఎఫ్ఈవో కంపెనీకి రు. 55 కోట్లను దారి మళ్ళించినట్లు కేటీఆర్ పై ఏసీబీ అభియోగాలను మోపింది.
ఆర్ధికశాఖ అనుమతి లేకుండా, క్యాబినెట్ నిర్ణయం లేకుండా, రిజర్వ్ బ్యాంకు అనుమతి తీసుకోకుండా, ఎన్నికల కమిషన్ కు తెలియకుండానే అప్పట్లో కేటీఆర్ హెచ్ఎండీఏ నిధులు రు. 55 కోట్లను బ్రిటన్ కంపెనీకి చెల్లించారు. విదేశీకంపెనీలకు నిధులు చెల్లించాలంటే అందుకు రిజర్వ్ బ్యాంకు అనుమతి తీసుకోవాలి. అలాగే నిధులు మళ్ళించే సమయానికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కాబట్టి నిధుల చెల్లింపుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి కూడా అవసరం. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కేటీఆర్ నోటిమాటగా అర్వింద్ కుమార్ ను ఆదేశించి కోట్ల రూపాయల నిధులను బ్రిటన్ కంపెనీకి చెల్లించేయటం నిబంధనలకు విరుద్ధమని ఏసీబీ గుర్తించింది.

