తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. పగటిపూట ఎండ తీవ్రంగా ఉండే, రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గకుండా అధికంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కీలక హెచ్చరికలు చేశారు.
ప్రజలంగా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా కీలలక ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నందున ఆయా జిల్లాల అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని, తాగు నీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు జిల్లా ఆసుపత్రుల వరకు వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బతో ఎవరైనా ఆసుపత్రుల్లో చేరితే తగిన వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు చేయకుండా ఉండాలని సీఎం సూచించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

