ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'పొదుపు' పిలుపుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం స్పందించింది. గురువారం అమరావతి సచివాలయంలో చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో వారానికి ఒకరోజు 'నో వెహికల్ డే' గా పాటించాలని సమావేశం నిర్ణయించింది.
పొదుపు చర్యలపై చంద్రబాబు మాట్లాడుతు కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించినంత మాత్రాన పొదుపు చర్యలు పాటిస్తున్నట్లు అయిపోదన్నారు. దేశాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యతగా చంద్రబాబు మంత్రులు, అధికారులకు గుర్తుచేశారు. పొదుపు విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
కొన్నిరోజులు మంత్రులు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించాలని సూచించారు. అవసరమైతే సెక్రటేరియట్ కు సైకిల్ మీద రావాలని చెప్పారు. సంక్షోభ నిర్వహణ అందరికీ రావాలని చెప్పారు. ఈ విషయంలో మంత్రులు, ఉన్నతాధికారులు ముందు బాధ్యతగా వ్యవహరిస్తే మిగిలిన వారికి పొదుపు చర్యలగురించి చెప్పవచ్చన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఉపయోగిస్తున్న కార్లన్నింటినీ ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవాలని తెలిపారు. జిల్లాల పర్యటనల్లో కూడా మంత్రులు ఖర్చలు బాగా తగ్గించాలన్నారు. వీలైనంతలో సమావేశాలను వర్చువల్ గానే నిర్వహించాలని చెప్పారు. ప్రజెన్స్ అవసరంలేని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చలను తగ్గించుకోవాలని చెప్పారు.
పొదుపు చర్యలని ఒకేసారి చెబితే ప్రజలు ఇబ్బంది పడతారని డిప్యుటి సీఎం పవన్ కల్యాణ్ అనుమానించారు. అందుకనే పొదుపు చర్యల విషయంలో నిదానంగా వెళదామన్నారు. రెండురోజుల పాటు పొదుపు చర్యలగురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. అందుకు మిగిలిన మంత్రులు అంగీకరించారు. వర్క్ ఫ్రం హోమ్, కార్ పూలింగ్ లాంటి చర్యలు వెంటనే పాటించాలని సీఎం సూచించారు. వివిధ శాఖల్లో చేపట్టాల్సిన పొదుపు చర్యలపై నివేదిక సమర్పించాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.

