Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nara Lokesh : ఎర్రబస్సు రాని చోట.  ఎయిర్ బస్సు వాలింది : నారా లోకేష్‌..!

Nara Lokesh : ఎర్రబస్సు రాని చోట. ఎయిర్ బస్సు వాలింది : నారా లోకేష్‌..!

TheTeluguNews 2 weeks ago

Nara Lokesh : భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఉత్తరాంధ్ర అభివృద్ధి, డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పనితీరు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సభికులను ఉత్సాహపరిచాయి. ప్రసంగాన్ని ప్రారంభించిన లోకేష్… ఒకప్పుడు “ఎర్రబస్సు కూడా రాని ప్రాంతానికి విమానాశ్రయం ఎందుకు?” అని కొందరు ప్రశ్నించారని గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలతో ఉత్తరాంధ్ర ప్రజలను చిన్నచూపు చూశారని, అలాంటి విమర్శలకు ఈ రోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘన ప్రారంభోత్సవమే గట్టి సమాధానమని అన్నారు.ఈ కార్యక్రమానికి ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. ముందుగా గిరిజన విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ ధింసా నృత్యాన్ని ఆసక్తిగా వీక్షించారు. అనంతరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి, టెర్మినల్ భవనాలను పరిశీలించారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో ముందుగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రసంగించగా, అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.

Nara Lokesh : ఎర్రబస్సు రాని చోట… ఎయిర్ బస్సు వాలింది : నారా లోకేష్‌..!

Nara Lokesh ఉత్తరాంధ్ర గౌరవాన్ని ప్రపంచానికి చాటిన భోగాపురం విమానాశ్రయం

“ఎర్రబస్సు రాదు అన్న చోటికి ఎయిర్‌పోర్ట్ వచ్చింది… ఎర్రబస్సు రాదు అన్న చోటికి ఎయిర్‌బస్ వచ్చింది… ఎర్రబస్సు రాదు అన్న చోటికి ఏకంగా మన నమో వచ్చారు. ఇదే ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా” అంటూ లోకేష్ తన ప్రసంగాన్ని ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ వ్యాఖ్యలతో సభ ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది.స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన పవిత్ర నేల ఉత్తరాంధ్ర అని కొనియాడిన ఆయన, ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, వీరత్వం, పౌరుషం గురించి ప్రపంచం మాట్లాడుతుందని పేర్కొన్నారు.దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు పోరాడితే… ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలు ఇచ్చింది మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. రైతుల త్యాగం, కార్మికుల శ్రమ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టికి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతీకగా నిలిచిందని అభివర్ణించారు.అల్లూరి సీతారామరాజులో కనిపించిన పట్టుదల, దేశభక్తి, ధైర్యం వంటి లక్షణాలు ప్రధాని మోదీలోనూ కనిపిస్తాయని లోకేష్ అన్నారు. “నమో అంటే ధైర్యం… నమో అంటే విశ్వాసం… నమో అంటే సురక్షిత భారత్” అని కొనియాడారు.రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ప్రయాణం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ అన్ని విధాలా అండగా నిలిచారని గుర్తుచేశారు. రాష్ట్రంలో “నమో” అంటే నాయుడుజీ-మోదీజీ కలయిక అని పేర్కొంటూ, ఈ ఇద్దరి నాయకత్వమే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్‌లా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని వ్యాఖ్యానించారు.

Nara Lokesh డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ఉత్తరాంధ్రకు అభివృద్ధి వేగం

రికార్డు సమయంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేయడం మాత్రమే కాకుండా, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు ప్రత్యేక ప్యాకేజీ, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు వంటి అనేక కీలక నిర్ణయాలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే సాధ్యమయ్యాయని లోకేష్ తెలిపారు.రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఏఎంసీఏ ఫైటర్ జెట్ ప్రాజెక్టులు రావడానికి ప్రధాని మోదీ ప్రత్యేక చొరవే కారణమని ఆయన పేర్కొన్నారు.”మోదీ విజన్… చంద్రబాబు ఎగ్జిక్యూషన్” కలిసే వికసిత్ ఉత్తరాంధ్ర లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. నదులు, అడవులు, సహజ వనరులు, సుదీర్ఘ సముద్ర తీరం ఉత్తరాంధ్రకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరమని అన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రను అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చామని చెప్పారు. ఇక్కడి ప్రజల నమ్మకం, ఆశీర్వాదాల వల్లే భోగాపురం ప్రపంచ పటంలో నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్డీఏకు క్లీన్ స్వీప్ విజయాన్ని అందించారని, ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని స్పష్టం చేశారు.రాజాం ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జునరావు (జీఎంఆర్) రికార్డు సమయంలో విమానాశ్రయం నిర్మించి తన జన్మభూమికి రుణం తీర్చుకున్నారని లోకేష్ ప్రశంసించారు.అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిర్ణయించిన గడువుకంటే ఐదు నెలల ముందుగానే పనులు పూర్తయ్యేలా కృషి చేశారని ప్రత్యేకంగా అభినందించారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గొప్ప వరమని పేర్కొన్న లోకేష్, భవిష్యత్తులో ఇది వేలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారుతుందని చెప్పారు. ఎగుమతులు, దిగుమతులకు ప్రధాన హబ్‌గా ఎదుగుతూ పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాల అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక వారధిగా నిలుస్తుందని తెలిపారు.రోడ్డు, రైలు, విమాన, సముద్ర మార్గాల సమగ్ర కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్‌కు నిజమైన “గ్రోత్ ఇంజిన్”గా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.గతంలో ఉత్తరాంధ్ర అంటే వలసలు, వెనుకబాటుతనం, చిన్నచూపు అనే భావన ఉండేదని గుర్తు చేసిన లోకేష్, ఇప్పుడు అదే ప్రాంతం ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధికి చిరునామాగా మారుతోందన్నారు.”ఇకపై ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం విమానం ఎక్కి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు… అవకాశాలే విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వస్తాయి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో విశేషంగా ఆకట్టుకున్నాయి.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు మాత్రమే అయినప్పటికీ, ఈ కాలంలోనే ప్రధానమంత్రి మోదీ ఐదుసార్లు ఆంధ్రప్రదేశ్‌కు రావడం రాష్ట్ర ప్రజలపై ఆయనకు ఉన్న ప్రత్యేక అనుబంధానికి నిదర్శనమని లోకేష్ పేర్కొన్నారు.గుజరాత్‌లో ఒకే ప్రభుత్వం దీర్ఘకాలంగా కొనసాగడం వల్ల అభివృద్ధి వేగంగా జరిగిందని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలంటే ప్రభుత్వ స్థిరత్వం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.సంక్షేమం, అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి రెండు చక్రాల్లాంటివని పేర్కొంటూ… రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.చివరిగా… “ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం కాదు… ఇది ఈస్ట్ కోస్ట్ ఇండియా యుగం. సుందర్‌బన్ నుంచి శ్రీహరికోట వరకు ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాకెట్ వేగంతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోంది. ఇదే నమో శక్తి” అంటూ మంత్రి నారా లోకేష్ తన ప్రసంగాన్ని ముగించారు. Nara Lokesh Speech, Bhogapuram Airport, Narendra Modi AP Visit, Andhra Pradesh Development, Alluri Sitarama Raju Airport , భోగాపురం ఎయిర్‌పోర్టు, నారా లోకేష్ ప్రసంగం, ఉత్తరాంధ్ర అభివృద్ధి, అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం, మోదీ ఏపీ పర్యటన, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TheTeluguNews