Pulivendula ' ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం 'క్రెడిట్ వార్' హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ కొత్త ప్రాజెక్టును ప్రారంభించినా..
“దాని ఆద్యులం మేమే, ఆ ఘనత మాదే” అంటూ వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ నుంచి విశాఖ గూగుల్ డేటా సెంటర్ వరకు ప్రతి అభివృద్ధి పని మీదా టీడీపీ, వైసీపీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. అయితే, తాజాగా ఈ క్రెడిట్ వార్ ఏకంగా ఇద్దరు ఉద్దండుల మధ్యకు చేరింది. వారే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జగన్ సొంత గడ్డ అయిన ‘పులివెందుల’ త్రాగునీటి ప్రాజెక్టు కేంద్రంగా ఇప్పుడు రాజకీయం మరింత వేడెక్కింది. ఇంతకీ పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పథకం వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఈ క్రెడిట్ నిజంగా ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? విశ్లేషిద్దాం.
Pulivendula : పులివెందుల దాహాన్ని తీర్చింది పవనా ? జగనా ?
Pulivendula జగన్ హయాంలో 40 శాతం పనులు.. అసలేం జరిగింది?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం పులివెందుల. అక్కడి సుమారు 5.5 లక్షల మంది ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే బృహత్తర లక్ష్యంతో ‘మెగా వాటర్ గ్రిడ్’ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం రూపకల్పన చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘జల్ జీవన్ మిషన్’ నిధులతో సుమారు రూ.480 కోట్ల భారీ అంచనా వ్యయంతో 2021లో వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే, జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం నుంచి నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ, రెండేళ్ల కాలవ్యవధి ఉన్నా ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైందని ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ వాస్తవ లెక్కలు పరిశీలిస్తే.. జగన్ సీఎంగా ఉన్న సమయంలో (2024 మార్చి నాటికి) రూ.182 కోట్లు వెచ్చించి 40 శాతం మేర పనులను పూర్తి చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో, సహజంగానే ఆ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భుజస్కంధాలపై పడింది.
రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్!
2024 జూన్ నెలలో ఏపీలో ఎన్డీయే కూటమి బంపర్ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలను తన చేతుల్లోకి తీసుకున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థి కంచుకోటపై ఏ అధికార పార్టీ అయినా సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది. కానీ, పవన్ కళ్యాణ్ అలా ఆలోచించలేదు. “ఇది జగన్ నియోజకవర్గం కదా, నాకెందుకు?” అని వదిలేయకుండా ఎంతో పరిపక్వతతో వ్యవహరించారు. పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. జల్ జీవన్ మిషన్ కింద ఆగిపోయిన మిగులు నిధులను ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పి కేంద్రం నుంచి వెంటనే విడుదల చేయించడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. అలా అదనంగా సుమారు రూ.203 కోట్ల నిధులను కేటాయించి, కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే ఏకంగా 56 శాతం పనులను పవన్ కళ్యాణ్ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. ఫలితంగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు 96 శాతం (మొత్తం రూ.385 కోట్ల వ్యయంతో) పూర్తయ్యింది. ఇప్పుడు పులివెందుల పరిధిలోని అనేక గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందుతోంది.
నిజమైన క్రెడిట్ ఎవరికి దక్కుతుంది?
గణాంకాలను బట్టి చూస్తే, ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణంలో అటు జగన్, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరి పాత్రా ఎంతో కీలకం. ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది మాజీ సీఎం జగన్ అయితే, దాన్ని రాజకీయ కక్షసాధింపులకు తావులేకుండా నిబద్ధతతో పూర్తి చేసింది మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సొంత నియోజకవర్గం అని పక్షపాతం చూపకుండా పులివెందుల ప్రజల గొంతు తడపడంలో పవన్ చూపించిన చొరవను రాజకీయ విశ్లేషకులు ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో, ఈ బృహత్తర ప్రాజెక్టును కలగని, నిధులు మంజూరు చేసిన జగన్ కృషిని కూడా తక్కువ అంచనా వేయకూడదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రాజెక్టు నూటికి నూరు శాతం అందుబాటులోకి వస్తే పులివెందుల చుట్టుపక్కల ఉన్న ఏకంగా 299 గ్రామాలకు శాశ్వతంగా తాగునీటి కష్టాలు తీరనున్నాయి. నాయకుల మధ్య క్రెడిట్ వార్ ఎలా ఉన్నా.. ప్రజల దాహం తీరడమే అంతిమంగా ప్రజాస్వామ్య విజయమని చెప్పవచ్చు!

