అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం కొనసాగుతోంది. ఇరాన్తో జరుగుతున్న యుద్దంలో అమెరికాకు చెందిన " F-15E స్ట్రైక్ ఈగల్" యుద్ధ విమానం కూలిపోయంది.
ఈ ఘటనలో తప్పిపోయిన రెండో పైలట్ కోసం అమెరికా ప్రత్యేక ఆపరేషన్ను నిర్వహించింది.
36 గంటల పాటు, కూలిన ఓ జెట్, తప్పిపోయిన కల్నల్ కోసం అగ్రరాజ్యం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. గత 20 ఏళ్లకు పైగా యుద్ధంలో ఒక అమెరికా యుద్ధ విమానం కూల్చివేయబడటం ఇదే మొదటిసారి అని, మాజీ F-16 యుద్ధ విమాన పైలట్ , రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ హ్యూస్టన్ కాంట్వెల్ అసోసియేటెడ్ ప్రెస్కు తెలిపారు.
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడుల్లో భాగంగా 2026 ఏప్రిల్ 3న ఈ ఘటన జరిగింది. అమెరికా యుద్ధ విమానం కూల్చివేయబడటానికి 48 గంటల ముందు... అమెరికా సైన్యం "ఇరాన్ను ఓడించి, పూర్తిగా నాశనం చేసిందని" అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు చెప్పారు. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ , ఇతర అధికారులు అమెరికా ఇరాన్ దేశ గగనతలంపై ఆధిపత్యం సాధించిందని పదేపదే చెప్పుకొచ్చారు. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ : "వారి వద్ద ఎలాంటి యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ ఎక్విప్మెంట్ లేవు. వారి రాడార్ 100 శాతం పూర్తిగా ధ్వంసమైంది. సైనిక శక్తిగా మనల్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు." అని అన్నారు.
అమెరికా యుద్ధ విమానం F-15E ను ఇరాన్ కూల్చివేసిన తర్వాత ఏం జరిగిందంటే...
F-15E విమానంలో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఒకరు పైలట్, మరొకరు వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్. ఇద్దరు అమెరికా అధికారులను ప్రస్తావిస్తూ ABC న్యూస్ కథనం ప్రకారం, ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే పైలట్ను రక్షించారు. అయితే, ట్రంప్ 'ట్రూత్ సోషల్' పోస్ట్లో ప్రకారం, కల్నల్ హోదాలో ఉన్న వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ను మాత్రం రక్షించలేకపోయారు.
సీబీఎస్ న్యూస్ ప్రకారం, నైరుతి ఇరాన్లోని కోహ్గిలుయే , బోయెర్-అహ్మద్ ప్రావిన్స్లోని ప్రమాదకరమైన పర్వతాలలో ఒంటరిగా, గాయపడి ఉన్నాడు. ఆ కల్నల్ "ఇరాన్లోని ప్రమాదకరమైన పర్వతాలలో శత్రువుల వెనుక చిక్కుకున్నాడు, గంటగంటకూ దగ్గరవుతున్న మన శత్రువులు అతని కోసం వేటాడుతున్నారు" అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఫార్స్ న్యూస్లో, "శత్రు పైలట్ లేదా పైలట్లను" పట్టుకున్న వారికి బహుమతి ఇస్తున్నట్లు ఒక యాంకర్ ప్రకటించారు. CNN కథనం ప్రకారం, తప్పిపోయిన పైలట్ కోసం మారుమూల పర్వత ప్రాంతంలో గాలింపులు చేపట్టిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై స్థానికులు కాల్పులు జరిపారు. ఇరాన్ ఐఆర్జిసి వారిని ప్రశంసించినట్లు సమాచారం.
తప్పిపోయిన పైలట్ల కోసం అమెరికా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో రెండు హెలికాప్టర్స్ను ఉపయోగించారు. అమెరికా అధికారులను పేర్కొంటూ CBS న్యూస్ ప్రసారం చేసిన కథనం ప్రకారం, రక్షించబడిన పైలట్ను తీసుకువెళ్తున్న హెలికాప్టర్పై కాల్పులు జరగడంతో అందులోని సిబ్బంది గాయపడ్డారు, అయినప్పటికీ అది సురక్షితంగా ల్యాండ్ అయింది. గాలింపు, సహాయక చర్యలకు సపోర్ట్గా పంపిన 'వార్హాగ్' గా పిలిచే ఏ-10 థండర్బోల్ట్ విమానంపై కూడా ఇరాన్ కాల్పులు జరిపిందని ఒక అమెరికా అధికారి ఎన్బిసి న్యూస్కు తెలిపారు.
దాడికి గురైన ఆ విమానం కువైట్ గగనతలంలోకి ప్రవేశించగా, అక్కడ పైలట్ బయటకు దూకడంతో విమానం కూలిపోయింది. పైలట్ క్షేమంగా ఉన్నారు. మొత్తానికి ఇరాన్ ఒకే రోజులో రెండు సైనిక విమానాలైన F-15E, A-10 లను కూల్చివేయడంతో పాటు, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై దాడి చేసింది. ఆదివారం ఉదయం, తప్పిపోయిన పైలట్ కోసం అమెరికా చేసిన ఆపరేషన్ విజయవంతమైనంది. ప్రస్తుతం అతడు అమెరికా బలగాల ఆధీనంలోనే సురక్షితంగా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్లోని పర్వత ప్రాంతాల్లో అతడిని గుర్తించినట్లు పేర్కొన్నారు.
Read more news like this on telugu.timesnownews.com

