ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ల మధ్య కొనసాగుతున్న యుద్దంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా యుద్ద నౌకపై ఇరాన్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ సైన్యం తెలిపింది.
అయితే తమ యుద్ద నౌకపై ఇరాన్ దాడి చేసిందనే వాదనను అమెరికా ఖండించింది. వివరాలు... హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలను బయటకు తీసుకురావడానికి అమెరికా సైన్యం సహాయం చేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే... హర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించకుండా ఒక అమెరికా నౌకాదళ డిస్ట్రాయర్ను తాము అడ్డుకున్నామని ఇరాన్ సైన్యం పేర్కొంది.
రవాణా, నౌకా భద్రత నిబంధనలను ఉల్లంఘించి హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక నౌకపై రెండు క్షిపణులతో దాడి జరిగిందని ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది.
అయితే తమ యుద్ధనౌకలలో ఒకదానిపై రెండు ఇరాన్ క్షిపణులు దాడి జరిగిందనే వాదనను అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ఖండించింది. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేసింది. అమెరికా నౌకలపై ఎటువంటి దాడి జరలేదని సెంట్కామ్ పేర్కొంది. అమెరికా దళాలు ఇరాన్ ఓడరేవులపై నావికా దిగ్బంధనాన్ని అమలు చేస్తున్నాయని తెలిపింది.
Read more news like this on telugu.timesnownews.com

