Dailyhunt
బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గం మొత్తం రీపోలింగ్... ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గం మొత్తం రీపోలింగ్... ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

Times Now Telugu 1 week ago

శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫాల్టా నియోజకవర్గం మొత్తం రీ పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

ఫాల్టా నియోజకవర్గంలో పోలింగ్ సమయంలో తీవ్రమైన ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగినట్టుగా గుర్తించిన నేపథ్యంలో... ఆ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లలో తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఆదేశిస్తున్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఫాల్టా నియోజవర్గంలోని అనేక పోలింగ్ కేంద్రాలలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో... గతంలో జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి, అన్ని బూత్‌లలో తిరిగి పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

ఫాల్టా నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో మే 21వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రీపోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మే 24న జరుగుతుందని తెలిపింది. ఇదిలాఉంటే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బెంగాల్‌లోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం తొలుత ఆదేశించింది. దీంతో దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్, మగ్రాహట్ పశ్చిమ్ అసెంబ్లీ నియోజకవర్గాలలోని 15 పోలింగ్ కేంద్రాల్లో శనివారం రోజున రీపోలింగ్ నిర్వహించారు.

టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ అనుచరుడు జహంగీర్ ఖాన్ పోటీ చేసిన ఫాల్టాలో... ఓటింగ్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని బూత్‌లలో ఈవీఎం ప్యానళ్లపై బీజేపీ, సీపీఎం అభ్యర్థుల పేర్ల దగ్గర టేపులు అతికించినట్లు చెబుతున్న వీడియోలను బీజేపీ నాయకులు ప్రచారం చేశారు. అదే సమయంలో పోలింగ్ సమయంలో అవకతవకలను సంబంధించి ప్రజల నుంచి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి.

మరోవైపు ఫాల్టా ప్రాంతంలో స్థానికులలో కొందరు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నామని ఆరోపించారు. ఈ క్రమంలోనే నిరసన చేపట్టారు. నిరసనలో పాల్గొన్న నివాసితులలో పలువురు మహిళలు కూడా ఉన్నారు. వారు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు తర్వాత తమ ప్రాంతంలో భద్రతా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ జెండాలు పట్టుకున్నవారితో పెద్ద సంఖ్యలో నిరసనకారులు హసీమ్‌నగర్ గ్రామంలో రహదారిని దిగ్బంధించారు. దీంతో అక్కడ ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ వెంటనే కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాల సిబ్బంది భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని, తగిన భద్రతా చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం 92.93 శాతానికి చేరుకుంది. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం ఇదే. ఏప్రిల్ 29న జరిగిన రెండో విడతలో 92.67 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశలో 93.19 శాతం ఓటింగ్ నమోదైంది.

ఇక, పశ్చిమ బెంగాల్‌లో ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్ మే 21న జరగనుండగా... రాష్ట్రంలోని మిగిలిన 293 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు మే 4వ తేదీన చేపట్టనున్నారు. ఇక, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు జరగనుంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu