దేశవ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగింది. ప్రతి నెలా ఒకటో తేదీన ఈ ధరలను సవరిస్తారనే సంగతి తెలిసిందే.
తాజాగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు... మే ఒకటో తేదీ నుంచి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 993 పెంచాయి. తాజాగా పెంపుతో ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర రూ.3,071.50కు చేరింది. అయితే గృహ వినియోగ సిలిండర్ల ధరలలో మాత్రం ఎలాంటి పెరుగుదల లేదు. ఇదిలాఉంటే, మిడిల్ ఈస్ట్లో యుద్దం ప్రారంభమైన తర్వాత దేశంలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను మార్చి ఒకటో తేదీన రూ. 144, గత నెల ఒకటో తేదీన రూ. 195.50 మేర పెంచాయి. అయితే తాజాగా వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ. 993 పెంచడంతో వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
భారతదేశం తన ఎల్పీజీ అవసరాలలో సుమారు 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటుంది. అయితే గత కొంతకాలంగా మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో వాణిజ్య నౌకల రవాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.
మిడిల్ ఈస్ట్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్దం ప్రారంభానికి ముందు భారతదేశం సగానికి పైగా ముడి చమురు దిగుమతులు, సుమారు 30 శాతం గ్యాస్, 85-90 శాతం ఎల్పీజీ దిగుమతులు సౌదీ అరేబియా, యూఏఈ వంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచి వచ్చేవి. అయితే మిడిల్ ఈస్ట్లో యుద్దంతో గల్ఫ్ ఇంధన సరఫరాలకు ప్రధాన రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిని దిగ్బంధించడానికి దారితీసింది. దీంతో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. రష్యాతో సహా పలు దేశాల నుండి చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా భారతదేశం ముడి చమురు సరఫరా అంతరాయాలను పాక్షికంగా అధిగమించినప్పటికీ... అయితే పారిశ్రామిక వినియోగదారులకు గ్యాస్ సరఫరా తగ్గించింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య సంస్థలకు ఎల్పీజీ లభ్యత కూడా తగ్గింది.
ఇక, తాజా పెంపుతో హైదరాబాద్ 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 3,315కు చేరింది.
ఇక, వాణిజ్య సిలిండర్లపై పెంపు ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి. మరి ఈ స్థాయిలో ధరల పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలతో సహా వాణిజ్య రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
ఇక, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) వంటి ప్రధాన చమురు సంస్థలు... అంతర్జాతీయ పరిణామాలు, మారకం రేట్లను పరిగణనలోకి తీసుకుంటూ, ప్రతి నెలా మొదటి తేదీన వాణిజ్య సిలిండర్ల ధరలను సవరిస్తుంటాయనే సంగతి తెలిసిందే.
ఇదిలాఉంటే, పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలలో ఎలాంటి పెంపు లేదు. ఆ ధరలు యథాతథంగా ఉన్నాయి. మరోవైపు,విమానయాన రంగానికి పెద్ద ఊరటనిస్తూ...దేశీయ విమానయాన సంస్థలకు (షెడ్యూల్డ్ కార్యకలాపాలు) ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలలో కూడా ప్రభుత్వం ఎటువంటి మార్పు చేయలేదు.
Read more news like this on telugu.timesnownews.com

