ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మహానాడును ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ ఏడాది మహానాడును నెల్లూరు జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పొదుపు చర్యల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు... మహానాడును ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించారు. మంగళగరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వేదిక ఏర్పాటు చేసి మహానాడు నిర్వహించాలని పార్టీ నేతలకు సీఎం సూచించారు. టీడీపీ కార్యాలయంలో జరిగే వేడుకలో పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యులు, ముఖ్య నేతలు పాల్గొంటారు.
ఈ నెల 27,28 తేదీలలో మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్గా నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఆయా క్లస్టర్ల నుంచి పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఇక, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు పొదుపు చర్యలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు తమ కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. తాజాగా పొదుపు చర్యల్లో భాగంగా టీడీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా మహానాడు వేడుకను ఆన్లైన్లో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించారు.
ఇక, తెలుగుదేశం పార్టీ అత్యంత కన్నుల పండువగా నిర్వహించే కార్యక్రమం మహానాడు. ప్రతి ఏడాది మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒక వేడుకలా జరుపుకుంటారు. ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని నిర్వహించే ఈ వేడుక టీడీపీ అభిమానులకు ఒక పండుగ వాతావరణం అనే చెప్పాలి. ఈ ఏడాది మహానాడును నెల్లూరు జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వేదిక ఖరారు చేసింది. నెల్లూరు నగరానికి సమీపంలోని కోవూరు నియోజకవర్గ పరిధిలోని కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో మహానాడు నిర్వహించాలని భావించారు. ఈ ప్రాంగణంలోనే మే 27,28,28 మహానాడును నిర్వహించేదుకు ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు.
తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించడంతో జిల్లా నేతలు ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని చరిత్రలో నిలిచిపోయేలాగా మహానాడు నిర్వ హించబోతున్నామని తెలిపారు. ఈ మహానాడుతో నెల్లూరు జిల్లా ముఖ చిత్రం మారబోతుందని విశ్వసనీయంగా నమ్ముతున్నాని చెప్పారు. మహా నాడును ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అయితే తాజాగా పొదుపు చర్యల్లో భాగంగా మహానాడును నెల్లూరు వేదికగా కాకుండా... పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వర్చువల్గా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీంతో నెల్లూరు జిల్లా టీడీపీ నేతలకు నిరాశే మిగిలింది.
Read more news like this on telugu.timesnownews.com

