ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్లలో హార్ధిక్ పాండ్యా ఒకడు. 2022 సీజన్లో ఏ మాత్రం అంచనాలు లేకుండా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు హార్ధిక్ పాండ్యా.
పాండ్యా టీమ్, ప్లేఆఫ్స్ చేరడం కూడా కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేసి, ఐపీఎల్ 2022 టైటిల్ విజేతగా నిలిచింది గుజరాత్ టైటాన్స్.
మొదటి సీజన్ ఏదో లక్కీగా గెలిచేశారని అనుకుంటే, 2023 సీజన్లో కూడా గుజరాత్ టైటాన్స్ టాప్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఫైనల్కి చేరిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్కి చుక్కలు చూపించింది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగిన హై డ్రామాలో లక్కీగా చెన్నై గెలిచి ఊపిరి పీల్చుకుంది.
రెండు సీజన్ల సక్సెస్ కారణంగా హార్ధిక్ పాండ్యాని పిలిచి మరీ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది ముంబై ఇండియన్స్. 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న హార్ధిక్ పాండ్యా.. 3 సీజన్లలో టైటిల్ గెలవలేకపోయాడు, కనీసం ఫైనల్కి కూడా చేర్చలేకపోయాడు.
- అక్కడ హిట్టు, ఇక్కడ ఎందుకు ఫట్టు...
ముంబై ఇండియన్స్తో పోలిస్తే, గుజరాత్ టైటాన్స్లో అనుభవం ఉన్న ప్లేయర్లు చాలా తక్కువ. యశ్ దయాల్, రవిశ్రీనివాసన్ సాయికిషోర్, రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్ వంటి యంగ్ ప్లేయర్లతో నిండిన టీమ్ని అద్భుతంగా నడిపించాడు హార్ధిక్ పాండ్యా. గుజరాత్ టైటాన్స్ టీమ్లో ఉన్న ఆశీష్ నెహ్రా నిర్ణయం తీసుకుంటే, దాన్ని అమలు చేయడంలో హార్ధిక్ పాండ్యా తన మేధస్సుని వాడేవాడు.
అయితే గుజరాత్ టైటాన్స్తో పోలిస్తే, ముంబై ఇండియన్స్లో స్టార్ కల్చర్ చాలా ఎక్కువ. చెన్నై సూపర్ కింగ్స్ వంటి టీమ్స్లో ప్రధాన బౌలర్లుగా ఆడిన దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్.. ముంబైలో తుది జట్టులో చోటు దక్కించుకోవడానికి కష్టపడుతున్నాంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
క్వింటన్ డి కాక్, రియాన్ రికెల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రిత్ బుమ్రా, దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్.. ఇలా తనకంటే ఎక్కువ వయసు, అనుభవం ఉన్న ప్లేయర్లను నడిపించే బాధ్యత తీసుకున్నాడు హార్ధిక్ పాండ్యా.
గుజరాత్ టైటాన్స్లో టీమ్పైన తనకున్న పట్టు, ముంబై ఇండియన్స్లో లేదు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కూడా అక్కడి నుంచే వెళ్లాడు.
- వనరులు ఎక్కువైనా కూడా...
గుజరాత్ టైటాన్స్లో వనరులు చాలా తక్కువ. ఉన్నవాటిని సరిగ్గా వాడుకుంటే రిజల్ట్ ఈజీగా వచ్చేది. అయితే ముంబై ఇండియన్స్లో అలా కాదు. టీమ్ నిండా అంతర్జాతీయ అనుభవం ఉన్న ప్లేయర్లు, స్టార్లు, సీనియర్లు. దీంతో వనరులు ఎక్కువ కావడంతో ఎవరిని ఎలా వాడాలో హార్ధిక్ పాండ్యాకి తెలియడం లేదు.
జస్ప్రిత్ బుమ్రా లాంటి గన్ బౌలర్ని కూడా సరిగ్గా వాడుకోలేకపోతున్నాడు హార్ధిక్ పాండ్యా. అదీకాకుండా ముంబైలో హార్ధిక్ తీసుకున్న నిర్ణయం, అమలు చేయాలంటే చాలా మందిని ఒప్పించాల్సి ఉంటుంది.
- ఒత్తిడి ఎక్కువైపోయి...
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా హార్ధిక్ పాండ్యా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఎలాంటి అంచనాలు లేవు. అదే అతనికి ప్లస్ అయ్యింది. అయితే ముంబై ఇండియన్స్ సారథిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు హార్ధిక్ పాండ్యాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలే హార్ధిక్ పాండ్యా పర్ఫామెన్స్ని దెబ్బ తీస్తున్నాయి.
ఐపీఎల్ 2024 సీజన్లో బుమ్రాని కాదని మొదటి ఓవర్ తానే వేసేవాడు హార్ధిక్ పాండ్యా. ఈ సీజన్లో హార్ధిక్ పాండ్యాలో ఆ కాన్పిడెన్స్ కనిపించడం లేదు. పవర్ ప్లేలో క్రిష్ భగత్ వంటి అనుభవం లేని బౌలర్ని వాడడం చూస్తుంటే హార్దిక్ పాండ్యాలో కాన్ఫిడెన్స్ ఎంత తగ్గిందో అర్థం అవుతోందని అంటున్నారు ముంబై ఇండియన్ ఫ్యాన్స్..
- టీమిండియా సారథిగా...
ఐపీఎల్ 2022 టైటిల్ విజయం తర్వాత హార్ధిక్ పాండ్యా, టీమిండియాకి తాత్కాలిక టీ20 సారథిగా వ్యవహరించాడు. రోహిత్ శర్మ కేవలం వన్డే, టెస్టులకు పరిమితం కావడంతో టీ20ల్లో టీమ్ని నడిపించాడు. 16 మ్యాచుల్లో 10 విజయాలతో 62.5 విజయాల శాతంతో సక్సెస్ అందుకున్నాడు హార్ధిక్ పాండ్యా. అలాంటి హార్ధిక్, ముంబై ఇండియన్స్ సారథిగా సక్సెస్ కోసం ఇబ్బంది పడుతుండడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
Read more news like this on telugu.timesnownews.com

