హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్... హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు మే 2వ తేదీన 24గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తుతుందని జలమండలి అధికారులు తెలిపారు.
జలమండలి ఆసిఫ్నగర్ ఫిల్టర్ బెడ్స్లో ఉన్న పాత బ్యాలెన్సింగ్ ట్యాంకును శుభ్రం చేయనుండటంతో మే 2న శనివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని జలమండలి అధికారులు చెప్పారు. ఈ పనుల నేపథ్యంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో లోప్రెజర్తో నీటిసరఫరా, గోషామహల్, కార్వాన్, గోల్కొండ, కవాడిగూడ, జూబ్లీహిల్స్ సర్కిళ్ల పరిధుల్లో సరఫరాలో అంతరాయాలు తలెత్తనున్నాయని తెలిపారు.
నగరంలోని రెడ్ హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీ నగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్ నగర్, సౌత్ సెంట్రల్ రైల్వే, నాంపల్లి, గన్ఫౌండ్రీ, చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్నగర్, అహ్మద్ నగర్, కవాడిగూడ వార్డు, గాంధీ నగర్ వార్డ్, దోమలగూడ, బంజారాహిల్స్ వార్డు పరిధిలో తాగునీటి సరఫరా అంతరాయం తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఇక, జలమండలి పరిధిలోని పలు వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గత వారం సందర్శించారు. కొండాపూర్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, బంజారాహిల్స్, సోమాజిగూడ ఫిల్లింగ్ స్టేషన్ లలో బుకింగ్ అధిగంగా ఉండడంతో అధికారులు 24 గంటలు మానిటర్ చేయలని అధికారులను ఆదేశించారు. పెండెన్సీ లేకుండా రెండు షిఫ్ట్ లలో ట్యాంకర్ డెలివరీ చేసేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
అలాగే కోకాపేటలోని బృందావన్ కాలనీలో కొత్త ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా ట్యాంకర్ బుకింగ్స్ పెరగడంతో, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ మీద దృష్టి సారించింది. మణికొండ, నార్సింగి పరిసర పరిధిలో పెరుగుతున్న తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు వేగంగా తాగు నీటిని అందించే విధంగా ట్యాంకర్ సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ ఫిల్లింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ... వేసవిలో వచ్చే నీటి డిమాండ్ ను ఎదుర్కోవడానికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ట్యాంకర్ బుక్ చేసిన వెంటనే డెలివరీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఏమైనా అవసరాలుంటే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ట్యాంకర్ బుకింగ్ లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. ప్రతి ట్యాంకర్ టోకెన్ పై బార్ కోడ్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. దీని వల్ల ప్రతి ట్రిప్పుల లెక్కలు పక్కాగా ఉంటాయన్నారు. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవి ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయానికి అనుసంధానమై ఉంటాయన్నారు. దీని వల్ల ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నట్లు గుర్తు చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వనరులు మితంగా లభిస్తున్నప్పటికీ, అవసరాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, ప్రజలందరూ నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని కోరారు. గృహ అవసరాలు, వాణిజ్య వినియోగం, ఇతర అవసరాల కోసం నీటి వినియోగం పెరుగుతున్న దృష్ట్యా, ప్రతి చుక్క నీరు విలువైనదిగా భావించి దుర్వినియోగాన్ని పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందని అన్నారు.
Read more news like this on telugu.timesnownews.com

