కటికచీకటి. చుట్టూదట్టమైన అడవి. కనుచూపు మేరలో కానరాని మనుషులు. తన కళ్లెదుటే కన్నతండ్రిని అత్యంత దారుణంగా చంపేశారు. అక్కడ నుంచి దుండగులు వెళ్లిపోయిన తర్వాత తన తండ్రి దగ్గరకు వెళ్ళి లేపాడు.
లే నాన్న వెళ్లిపోదాం అని పిలిచాడు. కానీ నాన్న లేవలేదు. దీంతో తండ్రి చనిపోయాడని నిర్ధారించుకున్నాడు. రాత్రంతా విగతజీవిగా పడి ఉన్న తండ్రి శవం పక్కనే ఉన్నాడు. ఎప్పుడు తెల్లవారుతుందా తన తండ్రిని ఎప్పుడు కాపాడుకుందామా అంటూ ఆ ఐదేళ్ల బాలుడు ఎదురుచూపులు...అమాయకత్వం అందరినీ కంటతడిపెట్టిస్తోంది. ఈ దారుణమైన ఘటన అన్నమయ్య జిల్లా పుంగనూరు అటవీ ప్రాంతంలో జరిగింది.
కుమారుడి ఎదుటే తండ్రిని చంపిన దుండగులు
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని గుడియాత్తంకు చెందిన గాంధీ తన ఐదేళ్ల కుమారుడితో పాటు మరికొందరితో కలిసి మద్యం సేవించడానికి బోయకొండ అడవికి వెళ్లాడు. మద్యం తాగిన తర్వాత వారి మధ్య తలెత్తిన వివాదం చివరకు గాంధీ హత్యకు దారితీసింది. నిందితులు అతడిని దారుణంగా కొట్టి చంపి, అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ ఘోరాన్ని కళ్లారా చూసిన ఐదేళ్ల గాంధీ కొడుకుని అక్కడే వదిలేసి పరారయ్యారు నిందితులు. రాత్రంతా ఆ అడవిలోనే తండ్రి శవం పక్కన భయంతో గడిపాడు ఆ బాలుడు.తెల్లవారగానే సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఆ అడవిలో ఒంటరిగా నడుచుకుంటూ సమీపంలోని ఓ అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడ అంగన్వాడీ టీచర్ను చూసి జరిగిన ఘోరాన్ని తెలియజేశాడు. తన తండ్రిని ఎవరో కొట్టారని...అప్పటి నుంచి లేవడం లేదని వాపోయాడు.
పోలీసులకు సమాచారం ఇచ్చిన అంగన్వాడీ టీచర్
ఐదేళ్ల బాలుడి మాటలను విన్న అంగన్వాడీ టీచర్ అన్ని వివరాలు సేకరించింది. వెంటనే ఆ పసిబాలుడితో సంఘటనా స్థలానికి చేరుకుంది.అక్కడ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న బాలుడి తండ్రిని చూసి షాక్కు గురైంది. బాలుడి తండ్రిని కొట్టిచంపారని నిర్ధారించుకుంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని...మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడిని అక్కున చేర్చుకుని జరిగిన దానిపై ఆరా తీశారు.
Read more news like this on telugu.timesnownews.com

