IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్కి ముందు ట్రేడింగ్ ద్వారా సంజూ శాంసన్ని టీమ్లోకి పట్టుకొచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. గత ఐదు సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ టీమ్కి కెప్టెన్గా వ్యవహరించిన సంజూ శాంసన్, భారీ అంచనాలతో సీఎస్కే టీమ్లోకి వచ్చాడు.
ఆరంభంలో ఫెయిల్ అయినా, సంజూ శాంసన్ బాగా ఆడిన ప్రతీ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయాలు అందుకుంది. సంజూ శాంసన్ ఫెయిల్ అయిన ప్రతీ మ్యాచ్లో (ముంబై ఇండియన్స్తో రెండో మ్యాచ్ మినహా) చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది.
- ఢిల్లీపై సెంచరీ...
మొదటి 3 మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచుల్లో సంజూ శాంసన్ సింగిల్ డిజిట్ స్కోరుకి అవుట్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో చెన్నైలో జరిగిన మ్యాచ్లో 115 పరుగులతో సెంచరీ అందుకున్న సంజూ శాంసన్.. చెన్నై సూపర్ కింగ్స్కి తొలి విజయాన్ని అందించాడు.
ఆ తర్వాత కేకేఆర్తో మ్యాచ్లో 48 పరుగులు చేసిన సంజూ, ముంబై ఇండియన్స్తో ముంబైలో జరిగిన మ్యాచ్లో 101 పరుగులు చేసి రెండో సెంచరీ చేశాడు. తాజాగా ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 87 పరుగులు చేసిన సంజూ శాంసన్... 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. ఇప్పటిదాకా 10 మ్యాచుల్లో 402 పరుగులు చేసిన సంజూ శాంసన్, ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడిన 2 మ్యాచుల్లోనే 202 పరుగులు చేయడం విశేషం.
- క్రిస్ గేల్ని దాటేసి...
ఒకే సీజన్లో ఒకే టీమ్పై 200+ పరుగులు చేసిన మూడో బ్యాటర్గా రికార్డు క్రియేట్ చేశాడు సంజూ శాంసన్. గతంలో పూణే వారియర్స్ ఇండియాపై 2013 సీజన్లో 196 పరుగులు చేశాడు క్రిస్ గేల్. ఓ మ్యాచ్లో పూణే వారియర్స్ ఇండియా టీమ్పై 175 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన క్రిస్ గేల్, అదే సీజన్లో అదే టీమ్తో ఆడిన మరో మ్యాచ్లో 21 పరుగులకి అవుట్ అయ్యాడు. ఈ రికార్డును సంజూ శాంసన్ దాటేశాడు.
2016లో గుజరాత్ లయన్స్పై విరాట్ కోహ్లీ 209 పరుగులు చేశాడు. ఓ మ్యాచ్లో 109 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మరో మ్యాచ్లో 100 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఒకే సీజన్లో ఒకే టీమ్పై 2 సెంచరీలు సాధించిన మొట్టమొదటి బ్యాటర్గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ.
2022లో ముంబై ఇండియన్స్పై 206 పరుగులు చేశాడు లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ కెఎల్ రాహుల్. ముంబై ఇండియన్స్తో మొదటి మ్యాచ్లో 60 బంతుల్లో 103 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఆ తర్వాత ముంబైతో మ్యాచ్లో 62 బంతుల్లో 103 పరుగుల చేశాడు. ఈ రెండు మ్యాచుల్లోనూ ముంబై ఇండియన్స్ జట్టు, కెఎల్ రాహుల్ని అవుట్ చేయలేకపోవడం, రెండు సార్లు లక్నో టీమ్ స్కోరు 200 కూడా దాటకపోవడం.. అయినా ముంబైపై విజయాలు అందుకోవడం విశేషం.
- ఢిల్లీ, చెన్నై ప్లేఆఫ్స్కి వెళితే..
సంజూ శాంసన్.. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది. అయితే అది జరగాలంటే ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు జట్లు కూడా ప్లేఆఫ్స్కి వెళ్లాలి. అప్పుడు రెండు జట్ల మధ్య మరో మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ మ్యాచ్లో సంజూ శాంసన్ 5 పరుగులు చేస్తే.. కెఎల్ రాహుల్ రికార్డును.. 8 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేస్తాడు. అయితే ప్రస్తుతం ఢిల్లీ 10 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, 5 విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. ప్లేఆఫ్స్లో తలబడే అవకాశాలు చాలా చాలా తక్కువ.
Read more news like this on telugu.timesnownews.com

