IPL 2026 RCB vs GT: బెంగళూరులో ఆర్సీబీ చేతుల్లో ఓడిన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది గుజరాత్ టైటాన్స్. ఆర్సీబీ విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని 4.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది గుజరాత్ టైటాన్స్.
6 పరుగులు చేసిన సాయి సుదర్శన్ని భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసి భువీ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. 19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 పరుగులు చేసిన జోస్ బట్లర్ని అవుట్ చేసిన భువీ... ఆర్సీబీ ఫ్యాన్స్లో ఆశలు రేపాడు.
వాషింగ్టన్ సుందర్ 12, షారుక్ ఖాన్ 8 పరుగులు చేసి రొమారియో షెఫర్డ్ బౌలింగ్లో అవుట్ అయ్యారు. 12 పరుగులు చేసిన జాసన్ హోల్డర్ని సుయాశ్ శర్మ అవుట్ చేశాడు. అయితే అప్పటికే గుజరాత్ టైటాన్స్ చేతుల్లోకి మ్యాచ్ వెళ్లిపోయింది. రాహుల్ తెవాటియా 27, రషీద్ ఖాన్ 7 పరుగులు చేసి మ్యాచ్ని ముగించారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
జాకబ్ బెథెల్ ఓ ఫోర్తో 5 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 13 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్తో 28 పరుగులు చేశాడు. దేవ్దత్ పడిక్కల్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. కెప్టెన్ రజత్ పటిదార్ 15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 19 పరుగులు చేయగా జితేశ్ శర్మ 1, టిమ్ డేవిడ్ 9, కృనాల్ పాండ్యా 4, రొమారియో షెఫర్డ్ 2 సిక్సర్లతో 17 పరుగులు, వెంకటేశ్ అయ్యర్ 12 పరుగులు చేశారు. భువనేశ్వర్ కుమార్ 15 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. జోష్ హేజల్వుడ్ మొదటి బంతికే రనౌట్ అయ్యాడు.
- మెరుపులా మొదలై...
ఆర్సీబీ ఇన్నింగ్స్కి ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. మహ్మద్ సిరాజ్ వేసిన మొదటి ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. కగిసో రబాడా వేసిన రెండో ఓవర్లో విరాట్ కోహ్లీ వరుసగా 4, 4, 4, 4, 4 రూపంలో 5 ఫోర్లు బాది 25 పరుగులు రాబట్టాడు. ఒకే ఓవర్లో 5 ఫోర్లు బాదిన మూడో ఆర్సీబీ బ్యాటర్గా విరాట్ కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. 2013లో పూణే వారియర్స్ ఇండియాపై క్రిస్ గేల్, 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్పై షేన్ వాట్సన్ ఒకే ఓవర్లో 5 ఫోర్లు బాదారు. మూడో ఓవర్లో జాకబ్ బెథల్ని మహ్మద్ సిరాజ్ అవుట్ చేయగా ఆ తర్వాతి ఓవర్లో విరాట్ కోహ్లీని రబాడా అవుట్ చేశాడు.
పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
- రజత్ పటిదార్ క్యాచ్పై వివాదం..
కెప్టెన్ రజత్ పటిదార్ అవుట్ విషయంలో అంపైర్ ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదమైంది. రజత్ పటిదార్ ఆడిన షాట్ని జాసన్ హోల్డర్ అందుకున్నాడు. అయితే క్యాచ్ పూర్తి చేసే క్రమంలో జాసన్ హోల్డర్, బంతిని నేలకి తాకించినట్టుగా టీవీ రిప్లైలో స్పష్టంగా కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ మాత్రం రజత్ పటిదార్ అవుట్ అయినట్టు ప్రకటించాడు. దీంతో విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, అంపైర్తో కాసేపు చర్చించడం కెమెరాల్లో కనిపించింది.
బౌలింగ్లో 2 వికెట్లు తీసిన జాసన్ హోల్డర్, ఫీల్డింగ్లో 3 క్యాచులు అందుకున్నాడు. అర్షద్ ఖాన్కి 3 వికెట్లు దక్కగా రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్, కగిసో రబాడా చెరో వికెట్ తీశారు.
Read more news like this on telugu.timesnownews.com

