Dailyhunt
ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్... డీల్ కుదరకపోతే యుద్ధానికి సిద్ధమని ప్రకటన

ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్... డీల్ కుదరకపోతే యుద్ధానికి సిద్ధమని ప్రకటన

శ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్,అమెరికాల మధ్య శాంతి చర్చలు సైతం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

ఇరాన్‌తో చర్చలు సఫలం కాకపోతే యుద్ధం తప్పదని, తాము ఇప్పటికే ఆయుధాలను సిద్ధం చేసుకున్నామంటూ బాంబు పేల్చారు.గత కాల్పుల విరమణ సమయంలో మేము మా శక్తిని మరింతగా కూడగట్టుకున్నాం. ఇప్పటికే అన్ని రకాల అత్యాధునిక ఆయుధాలను యుద్ధం కోసం సిద్ధం చేశాం అని ట్రంప్ ప్రకటించారు. శాంతి కోసం తాము ప్రతిపాదించే'డీల్'ను అంగీకరించాలని లేనిపక్షంలో వినాశకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గట్టిగా హెచ్చరించారు.

యుద్ధానికి వెళ్లడానికి సిద్ధం: ట్రంప్

ఇకపోతే ఇరాన్‌తో డీల్ కుదరకపోతే మేము మరోసారి యుద్ధానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం అమెరికా సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు. కేవలం కాల్పుల విరమణతో సమస్య పరిష్కారం కాదని...పటిష్టమైన ఒప్పందం (డీల్) లేకుండా దీనిని కొనసాగించలేమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ కోసం మేము ఒక అద్భుతమైన డీల్ సిద్ధం చేస్తున్నాం. దీని ద్వారా శాంతి, భద్రత, రక్షణ ఏర్పడతాయి. నేను రూపొందించిన ఈ ఒప్పందాన్ని చూసి యావత్ ప్రపంచమే గర్వపడుతుంది అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీమా వ్యక్తం చేశారు.

చర్చల్లో పాల్గొననున్న జేడీ వాన్స్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరాన్, అమెరికా ప్రతినిధులు చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ శాంతి చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే బెదిరింపుల మధ్య చర్చలకు తాము సిద్ధంగా లేమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

అమెరికా తీరుపై ఇరాన్ విదేశాంగ మంత్రి ఆగ్రహం
మరోవైపు అమెరికా చేపడుతున్న రెచ్చగొట్టే చర్యలు, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కొనసాగింపునకు పెను ఆటంకంగా మారాయని ఇరాన్ ఘాటుగా హెచ్చరించింది. అమెరికా తన వైఖరిని మార్చుకోకపోతే చర్చల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చీ ఈ మేరకు పాకిస్థాన్, రష్యా విదేశాంగ మంత్రులతో వేర్వేరుగా ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్‌కు చెందిన'టౌస్కా'అనే కంటైనర్ నౌకను, దాని సిబ్బందిని అమెరికా అదుపులోకి తీసుకోవడాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్ నుంచి వైరుధ్యపూరిత ప్రకటనలు, బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు.

ఏప్రిల్ 8న తొలివిడత చర్చలు
ఇకపోతే ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌ 40 రోజులపాటు భీకర పోరు చేసిన సంగతి తెలిసిందే. 40 రోజుల యుద్ధం తర్వాత ఏప్రిల్ 8న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్‌లో తొలి విడత చర్చలు జరిగాయి. అయితే అమెరికా తీరు కారణంగా తదుపరి విడత చర్చల్లో పాల్గొనడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి తెలిపారు. అమెరికా ఒకవైపు దౌత్యం అంటున్నప్పటికీ, మరోవైపు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది అని ఇస్మాయిల్ బకాయి విమర్శించారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu