కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ కొవ్వూరు బ్రిడ్జి దగ్గర రోడ్డు దాటుతున్న పలువురిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లోనే మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు... ఉపాధి పనులకు వెళ్తున్న పలువురు కూలీలు ఈరోజు ఉదయం కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అలాగే మరణించిన మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు.
ఈ ప్రమాదంలో మరణించినవారిని మృతులను చీడిగ గ్రామానికి చెందిన వాసంశెట్టి సత్యవతి, పాలిక కృష్ణవేణి, చిట్టెమ్మ, చెల్లూరి అన్నవరంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిన ఎం అరుణ కుమారి, పాలిక నాగమణిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ ప్రమాదంపై ఏపీ మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాలోని కొవ్వూరు బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందడం కలచివేసిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఉపాధి పనులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి నారాయణ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం పనులకు వెళ్తున్న నలుగురు మహిళలు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
Read more news like this on telugu.timesnownews.com

