కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరిచింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ల మధ్య ప్రధానంగా పోటీ నెలకొండగా... బీజేపీ కూడా పలు స్థానాలపై ఆశలు పెట్టుకుంది.
ఈరోజు కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా... మొత్తం 140 స్థానాల్లో 100కు పైగా స్థానాల్లో విజయంతో యూడీఎఫ్ అధికారం కైవసం చేసుకునే దిశగా సాగుతుంది. అయితే కేరళలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని బీజేపీ గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పార్టీ ప్రయత్నాలు సత్పలిస్తున్నాయి. తాజాగా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఖాతా తెరిచింది. బీజేపీ అభ్యర్థులు మూడు చోట్ల విజయం సాధించారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల కంచుకోట అయిన చాతన్నూర్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బీబీ గోపకుమార్ విజయం సాధించారు. తద్వారా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయం నమోదు చేసింది. ఇక, కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. నేమోమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. రాజీవ్ చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి వి. మురళీధరన్ సోమవారం కాజకూటం అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించారు. ఇలా, మూడు స్థానాల్లో బీజేపీ విజయం నమోదు చేసింది.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా కేరళ ఎన్నికల ఫలితాలు ఒకే పద్ధతిలో సాగుతూ వచ్చాయి. ప్రతి ఐదేళ్లకు సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)ల మధ్య అధికారం మారుతూ వస్తోంది. అయితే కేరళలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని బీజేపీ పావులు కదుపుతుంది. అయితే ఇటీవలి కాలంలో పలు ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం పెంచుకోవడం... రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఆ పార్టీ నెమ్మదిగా రాజకీయ స్థానాన్ని ఏర్పరుచుకుంటోందని సూచిస్తున్నాయి.
2024 లోక్సభ ఎన్నికల్లో త్రిస్సూర్ బీజేపీ విజయం సాధించడం... రాష్ట్రంలో ఆ పార్టీకి బిగ్ బూస్ట్ ఇచ్చింది. ఇంకా, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తిరువనంతపురం, పాలక్కాడ్ వంటి పట్టణ నియోజకవర్గాలలో పెరుగుతున్న ఉనికి... రాష్ట్రంలో బీజేపీకి క్రమంగా ఆదరణ పెరుగుతుందని సూచిస్తోంది. అయితే ప్రస్తుతానికి అయితే సాంప్రదాయ ఎల్డీఎఫ్-యుడీఎఫ్ ఫ్రంట్ల మధ్య పోటీని త్రిముఖ పోరుగా మార్చే స్థాయికి బీజేపీ ఎదగలేదనే చెప్పాలి. ఎందుకంటే... ఇరు ఫ్రంట్లకు ఉన్న స్థిరమైన ఓట్ బ్యాంక్, స్థానిక కుల సంఘ సమీకరణాలు వంటి కారణాలు బీజేపీ రాష్ట్రంలో మూడో శక్తి ఆవిర్భవించడానికి చాలా తక్కువ అవకాశాన్ని ఇచ్చాయి.
అయితే ఇటీవలి కాలంలో వివిధ ఎన్నికల్లో ఫలితాలతో రాబోయే రోజుల్లో కేరళలో తమ పార్టీ మరింత బలంగా రాణిస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 3 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.
Read more news like this on telugu.timesnownews.com

