ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్న మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఖోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారని సమాచారం.
ఈ మేరకు ఒక దౌత్యపరమైన మెమోను ఉటంకిస్తూ ది టైమ్స్ పత్రిక రిపోర్టు చేసింది. మొజ్తబా ఖమేనీ అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఇరాన్లోని పవిత్ర నగరమైన ఖోమ్లో వైద్య చికిత్స పొందుతున్నారని తెలిపింది.
ఆ నివేదిక ప్రకారం... మొజ్తబా ఖమేనీ అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయన తీవ్రమైన అనారోగ్యంతో చికిత్సత పొందుతున్నారు. ఈ కారణంగా మొజ్తబా ఖమేనీ ప్రస్తతుం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో పాలుపంచుకోవడం లేదు.
''మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమంగా ఉండటంతో ఖోమ్లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయ ప్రక్రియలోనూ ఆయన పాలుపంచుకోలేని స్థితిలో ఉన్నారు'' అని ఆ పత్రంలో పేర్కొన్నట్లు ది టైమ్స్ నివేదిక పేర్కొంది. ఈ పత్రం అమెరికన్, ఇజ్రాయెల్ నిఘా సమాచారం ఆధారంగా రూపొందించినట్లు సమాచారం.
అయితే ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఆచూకీ గురించి సమాచారం బహిరంగపరచడం ఇదే మొదటిసారి. ఇక, షియా ఇస్లాంలో ఖోమ్ను పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నగరాన్ని ఇరాన్ మత రాజధానిగా కూడా పిలుస్తారు.
ఇదిలాఉంటే, ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ఖోమ్ నగరంలో జరుగుతున్నాయని ఆ పత్రాలను ఉటంకిస్తూ 'ది టైమ్స్' రిపోర్టు చేసింది. ఖోమ్లో ఒక పెద్ద సమాధి (మౌసోలియం) నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయని ఆ పత్రంలో ప్రస్తావించారని తెలిపింది. ఈ సమాధిలో ఒకటి కంటే ఎక్కువ సమాధులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆ సమాధి మందిరంలో అలీ ఖమేనీతో పాటు, ఇటీవల మరణించిన ఆయన కుటుంబంలోని ఇతర సభ్యుల మృతదేహాలను కూడా ఖననం చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ నివేదికలపై అటు అమెరికా నుంచి గాని, ఇటు ఇరాన్ నుంచి గాని ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.
అయితే, మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి గురించి గత నెలలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడుల సమయంలో మొజ్తబా ఖమేనీ గాయపడ్డారని ఆయన చెప్పారు. ఆయన ముఖం లేదా శరీరం వికృతంగా మారి ఉండవచ్చని తమకు తెలుసునని వ్యాఖ్యానించారు.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభంలో ఇరాన్పై జరిగిన బాంబు దాడిలో తన తండ్రి అలీ ఖమేనీ మరణించిన తర్వాత... మొజ్తబా దేశ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు.
Read more news like this on telugu.timesnownews.com

