కుల గణనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కులగణన అంశం ప్రభుత్వ పాలసీకి సంబంధించినది అని దీనిపై తాము జోక్యం చేసుకోలేమని తెలియజేసింది. ఈ మేరకు దేశంలో జనగణనలో భాగంగా కులగణన చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది.
జనగణనలో కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలపైన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించిన వాదనలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ మేరకు కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ సంచలన తీర్పు వెల్లడించారు.
ప్రభుత్వ పాలసీల్లో జోక్యం చేసుకోం
జనగణనలో కులగణన నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. కులగణన నిర్వహించాలా వద్దా అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం వారి జనాభా వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ కేసు విచాణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలంటే వెనుకబడిన వర్గాల్లో ఎంతమంది ఉన్నారో ప్రభుత్వం తెలుసుకోవాల్సిందే'అని సీజేఐ అభిప్రాయపడ్డారు.'కులగనన నిర్వహణ అనేది ప్రభుత్వ విధాన నిర్ణయం. వెనుకబాటుతనాన్ని గుర్తించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇది ప్రభుత్వ పాలసీకి సంబంధించిన అంశం. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోము'అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
పిటిషనర్ వాదనతో ఏకీభవించని సీజేఐ
ఇకపోతే జనగణనలో కుల ఆధారిత లెక్కలు తీసుకోవడం వల్ల కొన్ని సంస్థలు లేదా వర్గాలు దానిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కులగణనను తొలగించాలని కోరుతూ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ విచారించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన సీజేఐ పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలను అంగీకరించలేదు.కులగణన చేపట్టాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయానికి సంబంధించినంది అని అందులో తాము జోక్యం చేసుకోలేము అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
కులగణనపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం:మంత్రి వాకిటి శ్రీహరి
కులగణన నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక అభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు మరియు క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక న్యాయానికి బలాన్నిచ్చేదిగా ఉందన్నారు. సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు కులగణన అవసరమని సుప్రీంకోర్టు పేర్కొనడం ఎంతో కీలకమని మంత్రి అన్నారు. వెనుకబడిన వర్గాల అసలు జనాభా, వారి ఆర్థిక-సామాజిక పరిస్థితులు తెలిసినప్పుడే ప్రభుత్వాలు సరైన విధానాలు రూపొందించగలవని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
వెనుకబడిన వర్గాలకు నూతన ఆశలు కలిగించిన సుప్రీంకోర్టు తీర్పు
సమాజంలోని బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటే ఖచ్చితమైన గణాంకాలు అవసరమని, అదే లక్ష్యంతో కులగణన చేపట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వెనుకబడిన వర్గాలకు నూతన ఆశలు కలిగించిందని మంత్రి పేర్కొన్నారు. కులగణన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో కోర్టుల జోక్యం ఉండదని ధర్మాసనం స్పష్టం చేయడం రాజ్యాంగబద్ధ పరిపాలనకు బలమని మంత్రి వాకిటి శ్రీహరి అభిప్రాయపడ్డారు. సమగ్ర అభివృద్ధి, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం సాధనలో ఈ తీర్పు చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని, సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
Read more news like this on telugu.timesnownews.com

