దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళం, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కోటను బద్దలకొట్టి బీజేపీ తొలిసారి అధికారం కైవసం చేసుకోగా....
అస్సాంలో ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. కేరళలో యూడీఎఫ్ కూటమి అధికారం సొంతం చేసుకుంది. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించగా... పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి అధికారాన్ని నిలుపుకుంది. అయితే తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికలలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విజయం సాధించారు. అయితే ఈ ముగ్గురు కూడా మూడు వేర్వేరు పార్టీల నుంచి బరిలో నిలవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
ఇండియా లాటరీ కింగ్గా ప్రసిద్ది చెందిన శాంటియాగో మార్టిన్ కుటుంబానికి ముగ్గురు సభ్యులు తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికలలో పోటీ చేశారు. వారిలో శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్, కొడుకు జోస్ చార్లెస్, అల్లుడు ఆధవ్ అర్జున్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు కూడా వేర్వేరు పార్టీల నుంచి బరిలో నిలిచి గెలుపును సొంతం చేసుకున్నారు.
ఆధవ్ అర్జున రెడ్డి... శాంటియాగో మార్టిన్ కుమార్తె అయిన డైసీ మార్టిన్ను ఆధవ్ అర్జున రెడ్డి వివాహం చేసుకున్నారు. అర్జున రెడ్డి... విజయ్ నేతృత్వంలోని టీవీకేలో కీలక నేతగా ఉన్నారు. అలాగే విజయ్ అనుచరుడిగా గుర్తింపు పొందారు. విల్లివాక్కం నియోజకవర్గం నుంచి టీవీకే నుంచి పోటీ చేసి, 17,302 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. టీవీకే అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తుండటంతో... అర్జున రెడ్డికి మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.
లీమా రోజ్... శాంటియాగో మార్టిన్ సతీమణి లీమా రోజ్ మార్టిన్ కూడా ఎన్నికల బరిలో నిలిచారు. తమిళనాడులోని లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ నియోజకవర్గంలో లీమా రోజ్కు డీఎంకే, టీవీకే అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయినప్పటికీ దాదాపు 2,500 ఓట్ల స్వల్ప మెజారిటీతో లీనా రోజ్ విజేతగా నిలిచారు.
జోస్ చార్లెస్ మార్టిన్... శాంటియాగో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్. వృత్తిరీత్యా ఆయన ఒక వ్యాపారవేత్త. గతేడాది డిసెంబర్లో జోస్ చార్లెస్.. లక్ష్య జననాయక కచ్చి పేరుతో పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. పుదుచ్చేరిలో లక్ష్య జననాయక కచ్చి పార్టీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒకదానిని కైవసం చేసుకుంది. లక్ష్య జననాయక కచ్చి పార్టీ అధ్యక్షుడైన చార్లెస్ మార్టిన్... కామరాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి, 10,205 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Read more news like this on telugu.timesnownews.com

