మెక్సికోలో కాల్పులు కలకలం రేపాయి. ప్యూబ్లా రాష్ట్రంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున దుండగుడు జరిపిన కాల్పులు 10 మంది మరణించారు.
ఈ విషయాన్ని మెక్సికన్ అధికారులు ధ్రువీకరించారు. ప్యూబ్లా రాష్ట్రంలోని టెహుయిట్జింగో పట్టణంలో దుండగులు జరిపిన దాడిలో కనీసం 10 మంది మరణించినట్లు మెక్సికన్ అధికారులు ఆదివారం తెలిపారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. వీరిపై ఆదివారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయని ప్యూబ్లా ప్రజా భద్రతా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి ఫెడరల్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ నేరానికి పాల్పడినవారికి శిక్ష పరంగా ఎలాంటి మినహాయింపు ఉండదని ప్యూబ్లా ప్రజా భద్రతా సంస్థ హామీ ఇచ్చింది. ఈ దాడి ఎవరు చేశారు?, ఎందుకోసం చేశారు? అనే ఉద్దేశ్యాన్ని గుర్తించడానికి నిఘా సమాచార సేకరణ జరుగుతోందని తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా... ఇప్పటివరకు అనుమానితులు ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయంపై అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇక, ప్యూబ్లా రాష్ట్ర గవర్నర్ అలెజాండ్రో అర్మెంటా... ఈ దాడిపై ఇంకా స్పందించలేదు.
మెక్సికోలో తూర్పు-మధ్య ప్రాంతంలో ప్యూబ్లా రాష్ట్రం ఉంది. ఈ ఏడాది ప్యూబ్లా రాష్ట్రంలో ఇది మూడవ సాయుధ దాడి. ఫిబ్రవరిలో హుహుట్లాన్ ఎల్ గ్రాండే నగరంలో జరిగిన దాడిలో ఆరుగురు మరణించారు. కొన్ని రోజుల తర్వాత ప్యూబ్లా రాజధానిలో ఓ వాహనంపై జరిగిన దాడిలో ముగ్గురు మరణించారు.
అయితే సెంట్రల్ మెక్సికో ప్రాంతంలో హింసాత్మక ఘటనలు విపరీతంగా పెరిగాయి. ఈ కారణంగా 800 నుంచి 1,000 కుటుంబాలు తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వచ్చింది.
Read more news like this on telugu.timesnownews.com

