ప్రధానమంత్రి మోదీ ఇటలీ పర్యటన వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి భారత ప్రధాని మోదీ ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెలోని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
''థాంక్యూ ఫర్ ది గిఫ్ట్'' అని మెలోని పేర్కొన్నారు. ఆ వీడియోలో ప్రధాని మోదీ... మెలోడి చాక్లెట్ ప్యాకెట్ను మెలోనికి అందించారు. అయితే ప్రధాని మోదీ చాలా మంచి గిఫ్ట్ తెచ్చారని మెలోని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మెలోడి అని చదువుతూ ప్రధాని మోదీ, మెలోనిలు నవ్వుతూ కనిపించారు.
ఇక, ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ చివరగా మంగళవారం ఇటలీ చేరుకున్నారు. ఇటలీ పర్యటనకు చేరుకున్న భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇటలీ ప్రధానమంత్రి మెలోని కూడా మోదీకి సోషల్ మీడియా వేదికగా స్వాగతం పలికారు. రోమ్ నగరంలో అడుగుపెట్టిన ప్రధాని మోదీతో దిగిన సెల్ఫీని కూడా మెలోని పోస్టు చేశారు. ''వెల్కమ్ టూ రోమ్... మై ఫ్రెండ్'' అంటూ మెలోని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక, ప్రధాని మోదీకి మెలోని విందు ఆతిథ్యం ఇచ్చారు. ఆ తర్వాత వారు రోమ్ నగరంలోని ప్రపంచ ప్రసిద్ధ, చారిత్రాత్మక కట్టడం కొలోసియం ఆంపిథియేటర్ను సందర్శించారు.

