ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వార్నింగ్ జారీ చేశారు. హర్మూజ్ జలసంధిని తెరించేందుకు తాను ఇచ్చిన గడువులోగా ఒప్పందం కుదుర్చుకోకపోతే...
ఒక్క రాత్రిలోనే ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి, హర్మూజ్ జలసంధిని తెరించేందుకు ఇరాన్కు ట్రంప్ డెడ్లైన్ విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ విధించిన తాజా డెడ్లైన్ వాషింగ్టన్ డీసీ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8:00 గంటలకు ముగియనుంది. మరోవైపు అమెరికా, ఇరాన్ల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించింది. బదులుగా ఈ సంఘర్షణకు శాశ్వత ముగింపు పలకాలని, తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్హౌస్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్లతో కలిసి ట్రంప్ ఈ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇరాన్లోని వివేకవంతమైన నాయకులు సద్భావనతో చర్చలు జరుపుతున్నారని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. అయితే ఇప్పటివరకు అయితే, ఫలితం అనిశ్చితంగానే ఉందని ట్రంప్ అన్నారు.
దక్షిణ ఇరాన్లో కూల్చివేయబడిన ఎఫ్-15 యుద్ధ విమానంలోని ఇద్దరు సిబ్బందిని అమెరికా దళాలు విజయవంతంగా రక్షించడాన్ని ట్రంప్ ప్రశంసించారు. అదే సమయంలో మంగళవారం గడువులోగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే ఇరాన్ ఇంధన, రవాణా మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేస్తుందనే తన హెచ్చరికను మరోసారి పునరుద్ఘాటించారు.
ఇరాన్ ఒక ఒప్పందం కుదుర్చుకోకపోతే... మంగళవారం రాత్రి ఇరాన్ పౌర విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై భారీ దాడులకు ఆదేశిస్తానని ట్రంప్ అన్నారు. ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను నామరూపాలు లేకుండా చేస్తామనే తన గత హెచ్చరికను గుర్తుచేస్తూ... వారికి వంతెనలు ఉండవని, విద్యుత్ కేంద్రాలు ఉండవని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ''ఒక్క రాత్రిలోనే దేశం (ఇరాన్) మొత్తాన్ని నాశనం చేయవచ్చు... ఆ రాత్రి రేపే కావచ్చు'' అని ట్రంప్ హెచ్చరించారు. గడువు ముగిసిన తర్వాత ఇరాన్ను 'రాతియుగానికి' పంపేస్తామని ట్రంప్ అన్నారు. అయితే తాను అలా చేయవలసి రాదని ఆశిస్తున్నానని తెలిపారు.
గడువు ముగిసిన తర్వాత ఇరాన్లోని ప్రతి వంతెనను ధ్వంసం చేస్తామని అన్నారు. విద్యుత్ ప్లాంట్లను పేల్చివేసి, మళ్లీ ఎప్పటికీ ఉపయోగించకుండా చేస్తామని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రణాళిక తన వద్ద ఉందని ట్రంప్ అన్నారు. నాలుగు గంటల్లోనే పని పూర్తి చేస్తామని కూడా హెచ్చరించారు. '' మనం కోరుకుంటే పూర్తి విధ్వంసం రాత్రి 12 గంటల వరకు, అంటే నాలుగు గంటల వ్యవధిలో జరిగిపోతుంది. అలా జరగడం మాకు ఇష్టం లేదు'' అని ట్రంప్ అన్నారు.
అయితే ఇరాన్లోని పౌర విద్యుత్ ప్లాంట్లపై అమెరికా దాడి చేస్తే ట్రంప్ యుద్ధ నేరాలకు పాల్పడినట్లేనని విమర్శకులు ఆరోపించగా, ట్రంప్ ఆ వాదనను తోసిపుచ్చారు. ''నేను దాని గురించి ఆందోళన చెందడం లేదు. యుద్ధ నేరం అంటే ఏమిటో మీకు తెలుసా? అణ్వాయుధాన్ని కలిగి ఉండటం యుద్ద నేరం'' అని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Read more news like this on telugu.timesnownews.com

