Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాకిస్తాన్‌లో సైనికులు వెళ్తున్న రైలులో భారీ పేలుడు... 24 మంది మృతి

పాకిస్తాన్‌లో సైనికులు వెళ్తున్న రైలులో భారీ పేలుడు... 24 మంది మృతి

Times Now Telugu 10 hrs ago

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఘోర పేలుడు చోటుచేసుకుంది. సైనిక సిబ్బందిని తీసుకువెళ్తున్న రైలులో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం 24 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.

క్వెట్టాలోని రైల్వే ట్రాక్ సమీపంలోఈ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి రైలు పాక్షికంగా దెబ్బతినగా, సమీపంలోని కనీసం 10 వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రైలులో చోటుచేసుకున్న శక్తివంతమై పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాల కిటికీలు, గాజు పలకలు పగిలిపోయాయని జియో టీవీ రిపోర్టు చేసింది. ఈ పేలుడుతో ఆ ప్రాంతంలో భయాందోళనలు వ్యాపించాయి. మరోవైపు ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానికల అధికారులు, అత్యవసర బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుడులో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

ఏఎఫ్‌పీ ప్రకారం... బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన క్వెట్టాలో జరిగిన ఈ దాడిలో మరణించిన వారిలో పలువురు సైనిక సిబ్బంది కూడా ఉన్నారు. ఈద్ సెలవుల కోసం చాలా మంది ప్రయాణికులు తమ ఇళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సైనిక సిబ్బంది కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి క్వెట్టా నుంచి పెషావర్‌కు ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు.

క్వెట్టాలోని చమన్ ఫాటక్ సమీపంలోని సిగ్నల్ పాయింట్‌ను రైలు దాటుతున్నప్పుడు ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు పదార్థాలతో నిండిన పరికరం ఒక రైలు బోగీని ఢీకొట్టడం వల్ల భారీ పేలుడు సంభవించిందని అధికారులు అనుమానిస్తున్నారు.

పేలుడు చోటుచేసుకున్న స్థలం నుంచి బయటకు వచ్చిన దృశ్యాలలో పట్టాల సమీపంలో ఒక నుజ్జునుజ్జు అయిన రైలు బోగీ బోల్తా పడి ఉండటం కనిపించింది. సహాయక సిబ్బంది, స్థానికులు అందులో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారని వెతకడం కనిపించింది.

బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన క్వెట్టా... ఇటీవలి సంవత్సరాలలో పదేపదే ఉగ్రవాద దాడులకు సాక్ష్యంగా నిలిచింది. ముఖ్యంగా రైల్వే మౌలిక సదుపాయాలు, పోలీస్ చెక్‌పాయింట్లు, పారామిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. బలూచిస్తాన్ అంతటా పెరుగుతున్న హింసాకాండ నేపథ్యంలో ఈ తాజా పేలుడు సంభవించింది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu