Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై వామపక్షాల పోరు: ఏపీలో వారం రోజులపాటు నిరసనలకు పిలుపు... 9న రాస్తారోకోలు

పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై వామపక్షాల పోరు: ఏపీలో వారం రోజులపాటు నిరసనలకు పిలుపు... 9న రాస్తారోకోలు

Times Now Telugu 2 weeks ago

పెట్రోల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా వామపక్ష పార్టీలు రాష్గ్రస్థాయిలో ఆందోళణలకు పిలుపునిచ్చాయి. రోజువారీ లెక్కన పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రం ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు మోపుతోందని...దీనికి వ్యతిరేకంగా జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు.

అలాగే ప్రతిపక్ష నాయకులపై కేంద్ర విచారణా సంస్థలను ప్రయోగించి అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. గురువారం సీపీఎం రాష్ట్ర రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. సీపీఐఎంఎల్ నాయకులు జాస్తి కిషోర్‌బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిరసనకు పిలుపునిచ్చారు.

వారం రోజులపాటు నిరసనలకు పిలుపు

దేశంలో నిరంకుశ చర్యలు, పౌరహక్కులు, ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను ఇప్పటికి నాలుగుసార్లు పెంచడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు. మరలా ధరలను పెంచుతున్నట్లు వచ్చిన వార్తల పట్ల సమావేశం ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా జూన్ 1 నుండి ఏడోతేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం కరపత్రాల పంపిణీ, సమావేశాలు, సదస్సుల రూపంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కేజీ బేసిన్ గ్యాస్ సాధన కోసం పాశర్లపూడి ప్రాంతంలో వామపక్షాలు జూన్ మొదటివారంలో పర్యటిస్తాయని వివరించారు. కేంద్రం పెట్రోలు ధరలను రోజువారీ లెక్కన పెంచుతోందని, దీనివల్ల రోజువారీ ఉపాధిపై ప్రభావం పడుతోందని, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు, తీవ్రంగా నష్టపోతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు.

అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు ఓ కుంభకోణం: శ్రీనివాసరావు
పెట్రోలు ధరల్లో 54 రూపాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే ఉన్నాయని, ధరలు పెరిగిన సమయంలో పన్నులు తగ్గించుకుని ప్రజలపై భారాలు పడకుండా చూడాల్సిన ప్రభుత్వం ఆపనిచేయడంలో చిత్తశుద్ధి చూపడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. పెరిగిన ధరలను ప్రజలపైనే రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండురోజులుగా జరుగుతున్న మహానాడులో గతంలో టిడిపి హామీ ఇచ్చినట్లుగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తూ తీర్మానం చేయాలని డిమాండు చేశారు. ప్రజలపై పడుతున్న భారాలను తగ్గించేందుకు పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలని కోరారు. కేజి బేసిన్ నుండి ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్‌లో 50 శాతం రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. రష్యా, ఇరాన్ నుండి అయిల్ కొనుగోలు కొనసాగించాలని, కమర్షియల్ గ్యాస్‌ను పాత ధరలకే ఇవ్వాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేజీ బేసిన్ గ్యాస్‌పై 50శాతం ప్రభుత్వానికి హక్కు కల్పించాలని కోరారు. కొత్తగా కాజ దగ్గర బయటపడ్డ గ్యాస్, అయిల్‌ను వేదాంతకు ఇచ్చారని, దీన్ని ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. ప్రజలపై భారం వేసేలా అమెరికా నుండి అయిల్ కొనుగోలు చేయడం వెనుక కార్పొరేట్ కంపెనీల కుంభకోణం కేసుల మాఫీ వ్యవహారం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు.

విజయన్‌పై దాడి కుట్రే : శ్రీనివాసరావు

మరోవైపు కేరళం మాజీ సీఎం పినరయి విజయన్‌పై దాడి వెనుక కేంద్రం కుట్ర ఉందని శ్రీనివాసరావు ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వ సంస్థలను జేబు సంస్థలుగా మార్చి ప్రతిపక్ష నేతలపై దాడులకు ఉసిగొల్పుతున్నారని, ప్రజలు దీన్ని చూస్తూ ఊరుకోరని తెలిపారు. కేంద్రం యువత విషయంలో వ్యవహరిస్తున్న విధానాలపై ఆగ్రహంతో వ్యంగ్యాస్త్రంగా ప్రారంభమైన కాక్రోచ్ జనతాపార్టీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోందని తెలిపారు. ప్రజల్లో అసంతృప్తి ఏజెండాగా ముందుకు వచ్చిందని తెలిపారు. దీన్ని సహించలేని కేంద్రం ఒకవైపు కాక్రోచ్ జనతాపార్టీ ఎక్స్ ఖాతాలను బ్లాక్ చేయించి మరోవైపు దీన్నుండి దృష్టి మళ్లించడానికే విజయన్ ఇంటిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను చూసి ప్రభుత్వం ఎంత భయపడుతుందో దీన్ని బట్టే అర్థం అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అవినీతిపరులు బీజేపీలో చేరితే పునీతులు: సీపీఐ నేత హరినాథ్‌రెడ్డి
ప్రతిపక్షంలో ఉండగా అవినీతిపరులని ముద్రలు వేసిన బీజేపీ వారి పార్టీలో చేరగానే పునీతులు అన్నట్లు ముఖ్యమంత్రి పదవులు కట్టబెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పి.హరినాథ్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత బెంగాల్, అస్సాం సిఎం ఇద్దరూ గతంలో అవినీతి కేసుల్లో ఉన్నారని...బీజేపీలో చేరగానే నిజాయితీ పరులంటూ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారని విమర్శించారు.మరోవైపు ప్రతిపక్ష పార్టీల నాయకులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. విజయన్ నివాసంలో ఈడి సోదాలు నిర్వహించడం దీనిలో భాగమేనని, ఇలాంటి చర్యలతో భయపెట్టాలని చూస్తే భయపడేవారు ఎవరూ ఉండరని హెచ్చరించారు. ధరల పెరుగుదలతో చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని వామపక్ష పార్టీలు నిర్ణయించామని తెలిపారు. క్రూడ్ అయిల్ ధరలు పెరగడం వల్ల పెట్రోలు ఛార్జీలు పెంచామని చెబుతున్న ప్రభుత్వాలు ధరలు తగ్గినప్పుడు ఎందుకు తగ్గించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్ రెడ్డి ప్రశ్నించారు.

స్వావలంభన డొల్లతనం : సీపీఐఎంఎల్ నాయకులు జాస్తి కిషోర్

దేశ స్వావలంభన అనేది డొల్లతనమని, ఇరాన్ యుద్ధ సమయంలో తేలిపోయిందని సీపీఐఎంఎల్ నాయకులు జాస్తి కిషోర్ తెలిపారు. దేశంలో సహజ వనరులు ఉన్నప్పటికీ 85 శాతం అయిల్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. దేశం తనకాళ్లపై తాను నిలబడేలా పాలకులు వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూన్‌లో వామపక్షాలు చేపట్టనున్న ఆందోళనల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐఎంఎల్ నాయకులు జాస్తి కిషోర్ కోరారు.

ప్రభుత్వ పన్నులు తగ్గించుకోవాలి: చిట్టిపాటి వెంకటేశ్వర్లు
ప్రజపై భారాలు పడకుండా పెట్రోలు ధరల విషయంలో ప్రభుత్వం పన్నుల వాటాను తగ్గించుకోవాలని సీపీఐఎంఎల్ న్యూడెమెక్రసీ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. పేదలపై భారాలు వేయడమే పనిగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ సమావేశంలో పొలారి, సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు హరినాథ్, ఎంసిపిఐయు నాయకులు గణేష్ పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొనలేకపోయిన ఆరఎస్‌పి, ఫార్వార్డ్ బ్లాక్, న్యూడెమెక్రసీ, ఎస్‌యుసిఐ(సి) నాయకులు సమావేశ నిర్ణయాలకు మద్దతు ప్రకటించారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu