Dailyhunt
రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో ఘోర ప్రమాదం... ఏసీ పేలి 9 మంది సజీవ దహనం!

రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో ఘోర ప్రమాదం... ఏసీ పేలి 9 మంది సజీవ దహనం!

Times Now Telugu 1 week ago

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో ఆదివారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాదంలో కనీసం తొమ్మిది మంది సజీవదహనం అయ్యారు.

ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఓ ఇంట్లోని ఏసీ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు.

మంటలను అదుపులోకి చేయడానికి మొత్తంగా 12 అగ్నిమాపక వాహనాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. అయితే మంటలు వేగంగా ఎగసిపడి మూడో, నాలుగో అంతస్తులకు కూడా వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది భవనం లోపల మంటల్లో చిక్కుకున్న పలువురిని రక్షించారు. అలాగే, గాయాలతో ఉన్నవారిని వెంటనే చికిత్స నిమిత్తం గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు.

అయితే దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన అనంతరం ఉదయం 6 గంటల సమయానికి మంటలు అదుపులోకి వచ్చాయి. అయినప్పటికీ... భవనంలో నుంచి పొగ వెలువడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇక, ఈ ప్రమాదంలో భవనంలోని అనేక భాగాలు కాలిపోయాయి.

''తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం గురించి మాకు ఒక సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక వాహనాలను, స్థానిక పోలీసులను ఘటనా స్థలానికి పంపాము. మంటలను అదుపులోకి తీసుకురావడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది, ఆ తర్వాత భవనంలో గాలింపు చర్యలు చేపట్టాము'' అని షాదారా డీసీపీ రాజేంద్ర ప్రసాద్ మీనా తెలిపారు. ఇక, అయితే ఈ ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను వెలికితీసినట్టుగా పోలీసులు చెప్పారు.

ఏసీ పేలుడు వల్లే అగ్ని ప్రమాదం...?
అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ఆ భవనంలో నివాసం ఉంటున్న కొందరు మాత్రం ఏసీ పేలడం వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడ భయాందోళనలు నెలకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానిక నివాసి చరణ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ... ''పదికి పైగా అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది బాల్కనీల ద్వారా సుమారు 20 మందిని రక్షించారు... కానీ వెనుక వైపు ఫ్లాట్లలోని కొందరు ఇంకా బయటకు రాలేకపోయారని నేను అనుకుంటున్నాను... ఒకటి లేదా రెండు కుటుంబాలు ఇంకా భవనం కిందనే ఉన్నాయని నేను భావిస్తున్నాను...'' అని చెప్పారు.

మరో నివాసి రోహిత్ మాట్లాడుతూ... ''ఏసీలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి... సుమారు 12-15 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. అయితే ఇంకా 4 నుంచి 5 మంది ఇంకా తెలియలేదు. తెల్లవారుజామున 03:13 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి... తెల్లవారుజామున 3:35 గంటల ప్రాంతంలో అగ్నిమాపక వాహనాలు వచ్చాయి... మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి...'' అని తెలిపారు.అయితే అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu