కృష్ణా జిల్లా గుడివాడలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వజ్రసహిత సువర్ణ కిరీటం మాయమైన వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాకట్టులో ఉన్న కిరీటాన్ని దేవస్థానం కమిటీ సభ్యులు విడిపించారు.
అనంతరం శుక్రవారం ఉదయం పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపం ఆలయంలో కిరీటాన్ని మీడియా ఎదుటప్రదర్శించారు. వజ్రసహిత సువర్ణకిరీటానికి సంప్రోక్షణ చేసి స్వామివారికి అలంకరిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ పోకూరి మోహనరావు తెలతిపారు. ఈ సందర్భంగా కల్యాణ మందిర నిర్మాణ నిధుల కోసమే కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్ అంగీకరించారు. తప్పు జరిగిందని మన్నించాలని కోరారు.
అసిస్టెంట్ కమిషనర్ లలిత విచారణలో తేలిన తాకట్టు అంశం
కృష్ణా జిల్లా గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో రూ.70 లక్షల విలువైన వజ్రసహిత సువర్ణ కిరీటం కిరీటం మాయమైంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కిరీటాన్ని ఆలయ కమిటీ సభ్యులు అక్రమంగా తాకట్టు పెట్టినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత కిరీటం మాయమవ్వడంపై ఆరా తీశారు. ఆలయానికి చేరుకుని అర్చకుల నుంచి వివరాలు సేకరించారు. తాకట్టుపై ఆరా తీశారు. అయితే తొలుత తాకట్టుపై కమిటీ సభ్యులు బుకాయించినప్పటికీ ఆ తర్వాత తాకట్టు పెట్టినట్లు అంగీకరించారు.
అందుబాటులోకి రాని ట్రస్ట్ బోర్డు సభ్యులు
మరోవైపు దేవాదాయ శాఖ అసిస్టంట్ కమిషనర్ లలిత విచారణ సందర్భంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు సహకరించలేదు అనే విమర్శలు ఉన్నాయి.వజ్రకిరీటంపై తనిఖీ నిమిత్తం విచారణకు వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ ట్రస్ట్ బోర్డులోని 31 మంది సభ్యుల్లో ఒక్కరు కూడా అందుబాటులోకి రాకపోవడం, ఫోన్లలో దాటవేత సమాధానాలు చెప్పడంపై లలిత తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందేజ. మరోవైపు తాకట్టుపై దాత సుబ్బారావు సైతం అసహనం వ్యక్తం చేశారు.వేంకటేశ్వరస్వామివారిపై భక్తితో తాను రూ.70లక్షలు విలువైన కిరీటాన్ని విరాళంగా సమర్పిస్తే ఇలా 38 లక్షల రూపాయలకు తాకట్టుపెట్టడం తమను కలచివేసింది అని దాత మాటూరి సుబ్బారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశఆరు. స్వామివారికి బహూకరించిన కానుకలతో ఇలా వ్యాపారం చేయడంపై భక్తులు సైతం మండిపడుతున్నారు. ఈ తాకట్టు అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, సివిల్ వ్యవహారంగా పేర్కొంటూ కోర్టుకు వెళ్లమని పోలీసులు సూచించినట్లు మాటూరి సుబ్బారావు తెలిపారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసిన ఈ కమిటీ నుండి ఆ బంగారు కిరీటాన్ని వెంటనే రికవరీ చేసి తమకు అప్పగించాలని, దాన్ని భక్తుల నమ్మకాన్ని కాపాడే మరో మంచి ఆలయానికి సమర్పిస్తామని దాత సుబ్బారావు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో కమిటీ సభ్యులు కిరీటాన్ని తాకట్టు నుంచి తీసుకువచ్చారు.
Read more news like this on telugu.timesnownews.com

