అమెరికా, ఇరాన్ల మధ్య కొంతకాలంగా కాల్పుల విరమణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇరాన్పై అమెరికా సైనిక దాడులను మళ్లీ ప్రారంభిస్తుందా? అనే ప్రశ్నలు కొద్ది రోజులుగా తలెత్తున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో సంచలన పోస్టు చేశారు. ట్రంప్ ఒక ఏఐ జనరేట్ చేసిన ఫొటోను షేర్ చేయగా... అందులో అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో యుద్ధనౌకల వద్ద నిలబడిన ట్రంప్ వేలు చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ ఫొటోలో... తుఫాను బీభత్సానికి ముందు ప్రశాంతత (It Was The Calm Before The Storm) అనే సందేశాన్ని ఉంచారు.
అమెరికా, ఇరాన్ల మధ్య తొలి విడత శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య రెండో విడత చర్చల కోసం మధ్యవర్తిత్వ దేశాలు ప్రయత్నాలు చేసినప్పటికీ... అవి ఫలించలేదు. మరోవైపు హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇరాన్, అమెరికాల మధ్య యుద్దం పూర్తిగా ఆపేందుకు దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు విఫలమైతే ఇరాన్పై తిరిగి సైనిక చర్య చేపట్టేందుకు అమెరికా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలోనే ట్రంప్ నుంచి ఈ పోస్టు రావడం చర్చనీయాంశంగా మారింది.
ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం... అమెరికా, ఇరాన్ల మద్య శాంతి చర్చలలో వేగం తగ్గిన నేపథ్యంలో అమెరికా సాధ్యమయ్యే తదుపరి దశ కార్యకలాపాల కోసం ప్రణాళికలను సిద్దం చేసింది. దీనిని అంతర్గతంగా ''ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0'' అని పిలుస్తున్నట్లు సమాచారం.
ఇక, అమెరికా, ఇరాన్ల మధ్య ఏప్రిల్ 7న కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుంచి చాలా వరకు సైనిక దాడులు నిలిచిపోయాయి. అయితే ఇరాన్పై దాడులను పునఃప్రారంభించే అవకాశాన్ని ట్రంప్ ఇంకా తోసిపుచ్చలేదని ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు ది న్యూయార్క్ టైమ్స్కు తెలిపారు.
ఒకవేళ దాడులు తిరిగి ప్రారంభమైతే.. ప్రభుత్వం అనేక సైనిక ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ 'ది న్యూయార్క్ టైమ్స్' రిపోర్టు చేసింది. ఒక ప్రత్యామ్నాయంలో ఇరాన్ సైనిక, మౌలిక సదుపాయాల లక్ష్యాలపై దాడులను తీవ్రతరం చేయడం ఉంటుంది. రెండో ప్రత్యామ్నాయంలో... భూమి లోపల భాగాల్లో నిల్వ ఉన్నాయని భావిస్తున్న అణు పదార్థాలను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ప్రత్యేక కార్యకలాపాల దళాలను మోహరించడం కూడా ఉన్నట్లు సమాచారం. అటువంటి మిషన్కు వేలాది మంది సహాయక దళాలు అవసరమవుతాయని, అలాగే ఇరాన్ బలగాలతో ప్రత్యక్ష ఘర్షణలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరో ప్రత్యామ్నాయంలో ఇరాన్కు అత్యంత ముఖ్యమైన చమురు ఎగుమతి కేంద్రాలలో ఒకటైన ఖార్గ్ ద్వీపాన్ని అమెరికా దళాలు స్వాధీనం చేసుకోవడం. అటువంటి ఆపరేషన్కు చాలా పెద్ద సైనిక మోహరింపు అవసరమవుతుందని, ఇది ఇరుదేశాల సంఘర్షణను తీవ్రతరం చేయగలదని విశ్లేషకులు అంటున్నారు.
ట్రంప్ తన రెండు రోజుల చైనా పర్యటన ముగించిన అనంతరం ఈ పోస్టు చేయడం సంచలనంగా మారింది. ఈ పర్యటనలో ట్రంప్... చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ఇరాన్లోని సంఘర్షణ, హోర్ముజ్ జలసంధి మూసివేతపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక, ''వారు (ఇరాన్) ఒక ఒప్పందం చేసుకోవాలి, లేకపోతే సర్వనాశనం అవుతారు. కాబట్టి ఏ విధంగానైనా మనమే గెలుస్తాం''అని చైనాకు బయలుదేరే ముందు మంగళవారం ట్రంప్ అన్నారు.
ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయబోదనే హామీ ఇవ్వాలని, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Read more news like this on telugu.timesnownews.com

