గుజరాత్ టైటాన్స్కి 2022 సీజన్లో టైటిల్ అందించిన హార్ధిక్ పాండ్యా, 2023 సీజన్లో ఫైనల్ చేర్చాడు. 2023 ఐపీఎల్ ఫైనల్లో ఆఖరి బంతి ఒక్కటీ సరిగ్గా పడి ఉంటే, వరుసగా రెండో సీజన్లో కూడా గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిచి ఉండేది.
2023 సీజన్ తర్వాత హార్ధిక్ పాండ్యా మళ్లీ ముంబై ఇండియన్స్కి వెళ్లిపోయాడు. దీంతో శుభ్మన్ గిల్కి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ దక్కింది. అయితే రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ని ప్లేఆఫ్స్కి కూడా తీసుకెళ్లలేకపోయాడు శుభ్మన్ గిల్.
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతుల్లో చిత్తగా ఓడింది గుజరాత్ టైటాన్స్. సాయి సుదర్శన్తో కలిసి ఓపెనింగ్ చేసిన శుభ్మన్ గిల్ జిడ్డు బ్యాటింగ్ చేశాడు. అలాగే కెప్టెన్సీలో అస్సలు మెప్పించలేకపోయాడు.
- వెంటవెంటనే 3 వికెట్లు తీసి...
2025 సీజన్లో పర్పుల్ క్యాప్ గెలిచిన ప్రసిద్ధ్ కృష్ణని 13వ ఓవర్లో బౌలింగ్కి తీసుకొచ్చాడు శుభ్మన్ గిల్. ప్రసిద్ధ్ కృష్ణ వస్తూనే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేశాడు.
ప్రసిద్ధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ కూడా అవుట్ అయ్యారు. మొదటి 2 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు ప్రసిద్ధ్ కృష్ణ. అతను వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 14 పరుగులు రాబట్టిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు, మ్యాచ్ని వన్ సైడ్ చేసేశారు.
ఈజీగా గెలిచేలా కనిపించిన పంజాబ్ కింగ్స్, ప్రసిద్ధ్ కృష్ణ స్పెల్ కారణంగా ఆఖరి ఓవర్ వరకూ పోరాడి గెలవాల్సి వచ్చింది.
- అనిల్ కుంబ్లే సీరియస్...
'ప్రసిద్ధ్ కృష్ణ, గత సీజన్లో పర్పుల్ క్యాప్ గెలిచాడు. అలాంటి బౌలర్ని 13వ ఓవర్లో బౌలింగ్ తీసుకురావడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. డెత్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా ఆపుతాడని ప్రసిద్ధ్ కృష్ణని ఆపి ఉంటాడు. అయితే మీరు చేసిన స్కోరుకి గెలవాలంటే పరుగులు నియంత్రించడం కంటే వికెట్లు తీయడం చాలా ముఖ్యం.
ప్రసిద్ధ్ కృష్ణ, బౌలింగ్కి వస్తూనే మొదటి బంతికి వికెట్ తీశాడు. అంతకుముందు శ్రేయస్ అయ్యర్ చేతికి గాయం కావడం వల్ల అతని ఏకాగ్రత దెబ్బతింది. అయితే బౌలర్కి కూడా క్రెడిట్ దక్కాల్సిందే. అసలు శుభ్మన్ గిల్ కెప్టెన్సీ ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇలా ప్రధాన బౌలర్ని లాస్ట్ వరకూ దాచి పెట్టడం ఎప్పుడూ చూడలేదు. అది కూడా మీరు చేసిన 160-162 పరుగుల టార్గెట్కి... మరి గిల్ మనసులో ఉందో నాకైతే అర్థం కాలేదు..' అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే.
గత సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్ ప్రసిద్ధ్ కృష్ణని పెట్టుకుని, అతనికి ఆఖరి వరకూ బౌలింగ్ ఇవ్వకపోవడంతో శుభ్మన్ గిల్పై సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ వస్తున్నాయి. అప్పుడప్పుడూ ఇలాగే వింతగా ప్రవర్తించే శుభ్మన్ గిల్కి టీమిండియా కెప్టెన్సీ ఏం చూసి ఇచ్చారో అర్థం కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. శ్రేయస్ అయ్యర్కి కాకుండా గిల్కి కెప్టెన్సీ ఇవ్వడం అన్యాయమంటూ వాపోతున్నారు.
Read more news like this on telugu.timesnownews.com

