ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అర్బన్ చాలెంజ్ ఫండ్ పథకం కింద గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ప్రతిపాదించిన 3 ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.
ఇందుకు సంబంధించిన వివరాలను విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు. విశాఖపట్నం భవిష్యత్ మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధికి ఇది ఒక గొప్ప ముందడుగు అని శ్రీభరత్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న అర్బన్ చాలెంజ్ ఫండ్ (UCF) పథకం కింద జీవీఎంసీ ప్రతిపాదించిన 3 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నేషనల్ అపెక్స్ కమిటీ (ఎన్ఏసీ) ఆమోదం తెలిపినందుకు ఆనందంగా ఉందని చెప్పారు.
మొత్తం రూ. 1,501.03 కోట్ల అంచనా వ్యయంతో ఈ మూడు ప్రాజెక్టులు అమలుకానున్నాయని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. ఆమోదం పొందిన ప్రాజెక్టులలో... 1 మధురవాడ జోన్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) వ్యవస్థ అభివృద్ధి, అంచనా వ్యయం రూ. 658.61 కోట్లు... మధురవాడ జోన్లో 24/7 స్మార్ట్ తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధి - అంచనా వ్యయం రూ. 725.18 కోట్లు... బల్క్ అండ్ సెమీ-బల్క్ నీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ మరియు పునరుద్ధరణ - అంచనా వ్యయం రూ. 117.24 కోట్లు ఉన్నాయి.
ఈ 3 ప్రాజెక్టులు విశాఖపట్నం పట్టణ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని ఎంపీ శ్రీభరత్ ఆకాక్షించారు. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధికి విలువైన సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విశాఖపట్నం భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఆధునిక నగరంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
ఇక, UCF పథకం కింద కేంద్రం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 25 శాతానికి సమానమైన రూ. 375.26 కోట్ల గ్రాంటును సమకూరుస్తుంది. మిగిలిన మొత్తం... ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ , కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి రుణాల ద్వారా నిధులు సమకూర్చబడతాయి.
Read more news like this on telugu.timesnownews.com

