Dailyhunt
West Bengal Election Result: ఆర్‌జీకర్ బాధితురాలి తల్లి రత్న ఘన విజయం... నెరవేరిన ఆమె లక్ష్యం

West Bengal Election Result: ఆర్‌జీకర్ బాధితురాలి తల్లి రత్న ఘన విజయం... నెరవేరిన ఆమె లక్ష్యం

Times Now Telugu 1 week ago

శ్చిమ బెంగాల్‌లోని ఆర్జీకర్‌ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధితురాలి తల్లి రత్న దేబ్‌నాథ్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

కోల్‌కతాలోని పానిహటి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రత్న... భారీ మెజారిటీతో విజయాన్ని అందుకుని అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాన్ని, ముఖ్యంగా మహిళల భద్రతను రత్న ప్రధానంగా ప్రస్తావించారు. తన కుమార్తెకు న్యాయం సాధించడం, రాష్ట్రంలో మహిళల భద్రత కోసం పోరాడటమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

తాను రాజకీయాల్లోకి వస్తే ప్రభావవంతంగా పనిచేయగలనని రత్న విశ్వాసం వ్యక్తం చేశారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపైనే కాకుండా... బెంగాల్‌లో నిరంతరం బాధితులుగా మారుతున్న ఎంతోమంది ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయంపై కూడా తాను పోరాడగలనని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా హోం మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలకాలని కోరుకుంటున్నట్టుగా ఆమె చెప్పారు.

తన కుమార్తె కేసులో దర్యాప్తు ప్రక్రియను, న్యాయ విచారణను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తన కుమార్తెకు న్యాయం జరిగేలా చూడటానికి, టీఎంసీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆమె పేర్కొన్నారు. బెంగాల్‌లో మహిళల భద్రత అంశాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని, సీఎం మమతా బెనర్జీని, టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ముఖ్య లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. బీజేపీలో చేరడంకు సంబంధించి తనపై ఎవరి ఒత్తిడి లేదని కూడా ఆమె వెల్లడించారు. బీజేపీలో చేరి, ఎన్నికల్లో పోటీ చేయాలనేది పూర్తిగా తన సొంత నిర్ణయమని పేర్కొన్నారు.

అయితే బెంగాల్‌లో బీజేపీ భారీ విజయం సాధించగా... ఆ పార్టీ నుంచి పానిహటి నియోజకవర్గంలో బరిలో నిలిచిన రత్న దేబ్‌నాథ్‌ను సైతం ప్రజలు గెలిపించారు. అంతేకాకుండా బెంగాల్‌లో మమతా బెనర్జీని గద్దె దింపాలనే తన లక్ష్యం కూడా నెరవేరినట్టు అయింది.

ఇక, 2024 ఆగస్టులో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై జరిగిన అత్యాచారం-హత్య ఘటన దేశవ్యాప్త ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సుదీర్ఘ కాలం వైద్యులు, పౌర సమాజం నిరసనలు చేపట్టింది. మరోవైపు ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ వివాదాంశంగా మారింది. సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం బాధ్యులను కాపాడుతోందని బీజేపీ ఆరోపించగా... టీఎంసీ ఆ ఆరోపణలను తిరస్కరించింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu