తమిళనాడు ఎన్నికల్లో టీవీకే విజయంలో తన పాత్రపై ఏపీ మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్ ఫొటో ప్రదర్శించారని, విజయ్ పార్టీ గెలుపునకు అది కూడా ఒక కారణమని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై జగన్ తొలిసారిగా స్పందించారు.
తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ కే పలుకుబడి ఉంటుందని, అక్కడ జగన్ తో పనేం ఉంటుందని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ఎన్నిక అవడంపై మాజీ సీఎం జగన్ స్పందన వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో జగన్ తో విజయ్ కలిసిన ఫొటోను ఓ అభిమాని ఇవ్వగా, దానిని విజయ్ బహిరంగ సభలో ప్రదర్శించారు. అంతకు ముందు జగన్ సమీప బంధువుల వివాహంలో కూడా ఇద్దరు కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో విజయ్-జగన్ మధ్య సాన్నిహిత్యంపై విస్తృత ప్రచారం సాగిందని అంటున్నారు. ఎన్నికల అనంతరం జగన్ అభిమానులు అంతా విజయ్ కు బాసటగా నిలబడటం కూడా ఆయనకు అడ్వాంటేజ్ అయిందని వైసీపీ శ్రేణులు ప్రచారం చేశాయి.
దీనిపై సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు చర్చలు జరగగా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాత్రం తొలిసారిగా స్పందించారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు విడుదల సమయంలో జగన్ లండన్ లో ఉన్నారు. ఈ నెల 10న ఆయన తిరిగి స్వదేశానికి వచ్చారు. గురువారం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలోనే విజయ్ గెలుపుపై జగన్మోనరెడ్డి స్పందన ఆసక్తి రేపింది.
తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ మీ ఫొటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారని, ఆ ప్రచారం ఆయనకు బాగా కలిసి వచ్చిందని చాలా మంది అంటున్నారని, దీనిపై మీ స్పందన ఏంటి అని విలేకరులు ప్రశ్నించగా, ఆయన రాష్ట్రంలో ఆయనకే ఎక్కువ పలుకుబడి ఉంటుంది. కానీ, జగన్ కు ఎలా ఉంటుందయ్యా? అంటూ నవ్వుతూ జగన్ చమత్కరించారు. దీంతో తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన క్రెడిట్ పూర్తిగా విజయ్ కే ఇచ్చేశారని, అందులో వాటా కోసం జగన్ ప్రయత్నించలేదని అంటున్నారు.
జగన్ ఫస్ట్ టైం..
కాగా, మాజీ సీఎం జగన్మోహనరెడ్డి మీడియా సమావేశం ఈ సారి కాస్త డిఫరెంటుగా జరిగిందని అంటున్నారు. విపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్మోహనరెడ్డి తరచూ మీడియాతో మాట్లాడుతున్నా, ఈ సారి కాస్త భిన్నంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు జగన్ మీడియా సమావేశం అంటే ఆయన మాట్లాడింది మాత్రమే మీడియా ప్రసారం చేసేదని చెబుతున్నారు. దీంతో జగన్ మీడియా సమావేశాలు రికార్డెడ్ ప్రొగ్రామ్ అంటూ ప్రత్యర్థులు విమర్శలు చేసేవారు. జగన్ మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఎప్పుడూ మీడియాను చూపేవారు కాదని అంటున్నారు. కానీ, ఈ సారి జగన్ విలేఖరుల ప్రశ్నలను ఎదుర్కోవడం, వాటికి సమాధానాలు చెప్పడం కొంతవరకు చర్చకు దారితీసిందని చెబుతున్నారు.

