Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్ ముందస్తు ప్రయోగం...సక్సెస్ రేటు ఎంత ?

జగన్ ముందస్తు ప్రయోగం...సక్సెస్ రేటు ఎంత ?

Tupaki.com 1 week ago

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2029 ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తున్నారు. ఒక విధంగా చూస్తే పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారనున్నాయని అంటున్నారు.

ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ ఓటమి పాలు అయితే 2034 వరకూ పార్టీ నిలిచి గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉంటాయన్న చర్చ ఉండనే ఉంది. అందుకే ఈసారి గెలుపు గుర్రాన్ని ఆరు నూరు అయినా ఎక్కాల్సిందే అన్నది వైసీపీ అధినేత పట్టుదలగా ఉంది. దాని కోసం ఆయన అనేక వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారు. దానిలో ఒకటిగా ముందస్తు ప్రయోగం చేయడానికి చూస్తున్నారు అని అంటున్నారు. ఇది ప్రచారంలోకి వచ్చిన విషయంగా కూడా ఉంది.

సగానికి పైగా సీట్లలో :

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా సీట్లలో ముందస్తుగా అభ్యర్ధులను ప్రకటినాలని జగన్ ఆలోచిస్తున్నారు అన్నది ప్రచారంలో ఉన్న మాట. అంటే 90 దాకా సీట్లలో అభ్యర్ధులను మూడేళ్లకు ముందే ప్రకటిస్తారు అన్న మాట. ఆ విధంగా చేయడం ద్వారా ఆయా నియోజకవర్గాలలో ఇప్పటి నుంచే వారు కట్టుబడి కష్టపడి పనిచేస్తారు అని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నియోజకవర్గం వరకూ ఖర్చులు వ్యయ ప్రయాసలు సాధక బాధలు వారే పడతారు అని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. పార్టీని వారు ఒక విధంగా మరింతగా సొంతం చేసుకుంటారని వారిలో తమకే సీటు ఇచ్చారు కాబట్టి గెలిచి రావాలన్న పట్టుదల కనిపిస్తుందని కూడా అంటున్నారు. అందుకే ఎంపిక చేసిన నియోజకవర్గాలలో ముందస్తుగా అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని అంటున్నారు.

వీరికి టికెట్ కచ్చితమే :

ఏ పార్టీలో అయినా పాతిక శాతం టికెట్లూ ఎపుడూ కొందరు సీనియర్లకు కచ్చితంగా ఇస్తారు. అలా వైసీపీలో కూడా సీనియర్ నేతలు మాజీ మంత్రులకు టికెట్లు ఎటూ ఖరారు చేస్తారు. అది అఫీషియల్ గా ప్రకటిస్తే వారితో పాటు క్యాడర్ లోనూ కొత్త ఉత్సాహం వస్తుందని ఫలితంగా వారంతా ముందుకు వచ్చి పని చేస్తారని హైకమాండ్ ఊహిస్తోంది అంటున్నారు. వీరితో పాటు మరో పాతిక శాతం మందిని బలం అధారంగా సామాజిక వర్గ సమీకరణలు ఇతర లెక్కలు చూసుకుని ఎంపిక చేస్తే సగానికి సగం ఏపీలో ముందస్తుగా వైసీపీ అభ్యర్ధులను ప్రకటించినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నికల మూడ్ ముందే వస్తుందని పార్టీ కూడా రీ యాక్టివ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ విధంగా సగం రాష్ట్రంలో వైసీపీ జోరు అందుకుంటే ఆ ప్రభావం మిగిలిన చోట్ల కూడా కనిపించి టోటల్ గా ఫ్యాన్ స్పీడ్ యమ రేంజిలో పెరిగిపోతుందని కూడా భావిస్తున్నారు.

మైనస్ పాయింట్లు ఇవే :

అయితే ముందుగా వైసీపీ అభ్యర్ధులను ప్రకటించడం వల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయని అంటున్నారు. అది కూడా మూడేళ్ళకు ముందే ప్రకటించడం వల్ల ఆయా చోట్ల కూటమికి చాన్స్ ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. వారు వీరిని మించిన వారిని బలవంతులను రంగంలోకి దింపితే అపుడు వైసీపీకి ఇబ్బంది అవుతుందని కూడా అంటున్నారు. అంతే కాదు వైసీపీ అభ్యర్ధులను చూసి అన్ని విధాలుగా మెరుగైన అభ్యర్ధులను కూటమి పార్టీలు సెలెక్ట్ చేసుకోవడానికి ఒక గోల్డెన్ చాన్స్ గా ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. మరో వైపు చూస్తే సొంత పార్టీలోనే ఈ నిర్ణయం వల్ల చాలా మంది ఆశావహులు డీలా పడిపోవచ్చు అని వారు మూడేళ్ళకు ముందే వైసీపీని వీడి ఇతర పార్టీలలో చేరేందుకు యత్నించవచ్చు అని అది వైసీపీకి బూమరాంగ్ అవుతుందని కూడా అంటున్నారు. అయితే ఈ ముందస్తు ప్రయోగం మీద వైసీపీలో అయితే ఇంకా తర్జన భర్జన పడుతున్నరు కానీ నిర్ణయానికి రాలేదని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం ఏ విధంగా ముందుకు సాగుతుందో.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu