Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తప్పదు భరించాల్సిందే.. తలకిందులు కానున్న ఇంటి బడ్జెట్!

తప్పదు భరించాల్సిందే.. తలకిందులు కానున్న ఇంటి బడ్జెట్!

Tupaki.com 1 week ago

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు సెగలు ఇప్పుడు సామాన్యుడి వంటింట్లోకి చేరుతున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటర్‌కు సగటున రూ.3 వరకు పెరగడం కేవలం వాహనదారులకే కాదు..

ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక పెద్ద 'ఆర్థిక షాక్'. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై ఈ తాజా పెరుగుదల 'గోరుచుట్టుపై రోకటి పోటు'లా మారింది.

ప్రమాద గంటికలు మోగిస్తున్న రవాణా ఛార్జీలు

ఇంధన ధరల పెరుగుదల ప్రభావం నేరుగా రవాణా రంగంపై పడుతుంది. డీజిల్ ధర పెరిగితే సరుకు రవాణా చేసే లారీలు, వ్యాన్‌ల యజమానులు తమ ఛార్జీలను పెంచక తప్పదు. దీనివల్ల నిత్యావసరాలైన పాలు, కూరగాయలు, గుడ్లు, మాంసం వంటి రోజువారీ వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. రైతుల నుంచి మార్కెట్‌కు, మార్కెట్ నుంచి రిటైల్ దుకాణాలకు సరుకు చేరేలోపు రవాణా ఖర్చు రెట్టింపు అవ్వడంతో ఆ భారాన్ని అంతిమంగా వినియోగదారుడే మోయాల్సి వస్తుంది.

ప్రజా రవాణా.. ప్రయాణం ఇక భారమే!

చదువు కోసం వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాల కోసం తిరిగే సామాన్యులు ఇప్పుడు ప్రయాణ ఖర్చుల లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. ఆటో ఛార్జీలు, క్యాబ్‌లు, ప్రైవేట్ బస్సుల ఛార్జీలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పెరిగిన మెట్రో ఛార్జీలతో సతమతమవుతున్న నగరవాసులకు, తాజా పెట్రో ధరల పెరుగుదల అదనపు భారం. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా 'ఫ్యూయల్ సర్ఛార్జ్' పేరుతో డెలివరీ ఛార్జీలను పెంచే అవకాశాలు ఉన్నాయి.

రైతన్నపై అదనపు భారం

దేశానికి వెన్నెముక అయిన రైతుపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది. సాగు పనులకు వాడే ట్రాక్టర్లు, నీటి మోటార్లు, పంట కోత యంత్రాలన్నీ డీజిల్‌తోనే నడుస్తాయి. ఇప్పటికే ఎరువులు, విత్తనాల ధరలు పెరగడంతో సతమతమవుతున్న రైతుకు, ఇప్పుడు సాగు, రవాణా వ్యయం పెరగడం పెద్ద దెబ్బ. ఇది చివరకు పంటల ధరల పెరుగుదలకు దారితీసి మళ్ళీ సామాన్యుడి భోజనపు పళ్లెంపైనే ప్రభావం చూపుతుంది.

నిర్మాణ రంగం.. కలల ఇల్లు కష్టమేనా?

సిమెంట్‌, ఇసుక, ఇనుము వంటి నిర్మాణ సామగ్రిని భారీ వాహనాల్లో రవాణా చేస్తారు. డీజిల్ ధరల ప్రభావంతో ఈ వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీనివల్ల సామాన్యుడి సొంతింటి కల మరింత వ్యయప్రయాసలతో కూడుకున్నదిగా మారనుంది. కాంట్రాక్టర్లు, డెవలపర్లు ఈ అదనపు వ్యయాన్ని ప్రాజెక్ట్ ధరల్లో కలిపే అవకాశం ఉంది.

మధ్యతరగతి 'పొదుపు' మంత్రం

జీతాలు పెరగవు కానీ ఖర్చులు మాత్రం రెక్కలు కట్టుకుని ఎగురుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబాలు తమ ఆర్థిక ప్రణాళికలను మార్చుకుంటున్నాయి. అనవసర ప్రయాణాలకు స్వస్తి పలకడం... వ్యక్తిగత వాహనాల కంటే ప్రజా రవాణా లేదా కార్‌పూలింగ్ వైపు మొగ్గు చూపడం... వినోదం, బయట భోజనాల వంటి ఖర్చులను తగ్గించుకోవడం వంటి చర్యలు చేపడుతున్నారు.

అనిశ్చితిలో సామాన్యుడు

అంతర్జాతీయంగా రష్యా-ఉక్రెయిన్ లేదా మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గకపోతే ముడి చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం పన్నుల తగ్గింపు ద్వారా ఉపశమనం కలిగించకపోతే.. సామాన్యుడి ఆర్థిక పరిస్థితి మరెంత దారుణంగా మారుతుందోనని జనం భయపడుతున్నారు. "సంపాదన స్థిరం.. ఖర్చు అస్థిరం" అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu