Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తొలి స్వదేశీ విమానం.. ఎట్టకేలకు భారత్ సాధించేసింది..

తొలి స్వదేశీ విమానం.. ఎట్టకేలకు భారత్ సాధించేసింది..

Tupaki.com 1 week ago

భారతదేశం నేడు కేవలం ఒక వినియోగదారు దేశం మాత్రమే కాదు.. ప్రపంచానికి సాంకేతికతను ఎగుమతి చేసే దిగ్గజంగా అవతరిస్తోంది. అంతరిక్షం నుంచి రక్షణ రంగం వరకు భారత్ సాధిస్తున్న విజయాలు అగ్రదేశాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ఒకప్పుడు విమానాలు, క్షిపణుల కోసం విదేశాల వైపు చూసిన మనం.. నేడు 'మేక్ ఇన్ ఇండియా' మంత్రంతో ప్రపంచ విమానయాన చిత్రపటాన్ని మార్చేస్తున్నాం. తాజాగా గుజరాత్‌లోని వడోదర నుంచి బయటకు వచ్చిన తొలి స్వదేశీ సి-295 రవాణా విమానం భారత పారిశ్రామిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం.

ఆత్మనిర్భర్ దిశగా ఏరోస్పేస్ విప్లవం

భారత రక్షణ రంగం గత దశాబ్ద కాలంగా అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. తేజస్ యుద్ధ విమానాలు, చేతక్ హెలికాప్టర్లు, ఇటీవల ఆపరేషన్ సిందూర్ ద్వారా వార్తల్లో నిలిచిన బ్రహ్మోస్ క్షిపణులు దేశీయ సాంకేతిక సత్తాను చాటిచెప్పాయి. అయితే రవాణా విమానాల తయారీలో మాత్రం ఇప్పటి వరకు ఒక లోటు ఉండేది. ఆ లోటును భర్తీ చేస్తూ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్), ఎయిర్‌బస్ భాగస్వామ్యంతో వడోదరలో ఏర్పాటు చేసిన ప్లాంట్ ఇప్పుడు రికార్డు సమయంలో విమానాన్ని సిద్ధం చేసింది. 2024లో ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే తొలి విమానాన్ని పట్టాలెక్కించడం భారత పారిశ్రామిక వేగానికి నిదర్శనం.

సి-295: ప్రత్యేకతలు, స్వదేశీ ముద్ర

భారత వాయుసేన (ఐఏఎఫ్) అవసరాల కోసం మొత్తం 56 విమానాల ఒప్పందం కుదరగా అందులో 40 విమానాలు పూర్తిగా వడోదరలోనే తయారుకానున్నాయి. ఈ విమానం విశేషాలు పరిశీలిస్తే ఈ తొలి విమానంలో వాడిన విడిభాగాల్లో దాదాపు 70 శాతం భారత్‌లోనే తయారయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న 37 చిన్న, మధ్య తరహా కంపెనీలు తయారు చేసిన 13,000లకు పైగా విడిభాగాలను ఈ విమాన నిర్మాణంలో ఉపయోగించారు. ఇది కేవలం సైనిక సామాగ్రిని తరలించడానికే కాకుండా, విపత్తుల సమయంలో సహాయక చర్యలకు, పారాట్రూపర్ల తరలింపునకు అత్యంత అనుకూలమైనది.

ప్రైవేట్ రంగం.. రాష్ట్రాల చొరవ

కేవలం ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేట్ రంగం కూడా ఏరోస్పేస్‌లో దూసుకుపోతోంది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ 'విక్రమ్-1' రాకెట్‌తో ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఊపిరి పోసింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలు ఏరోస్పేస్ హబ్‌లుగా మారుతున్నాయి. తిరుపతి జిల్లాను ఏరోస్పేస్ హబ్‌గా.. కడపను డ్రోన్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే 'డ్రోన్ టాక్సీ' నమూనా సిద్ధమైంది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ వచ్చే ఏడాది నాటికి ఇవి ఆకాశంలో ఎగిరే అవకాశం ఉంది.

గ్లోబల్ హబ్‌గా భారత్

సి-295 విమానం తయారీ అనేది కేవలం ఒక రక్షణ ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. ఇది కోట్లాది మంది భారతీయుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. పూర్తిస్థాయి దేశీయ పరిజ్ఞానంతో పౌర విమానాలు తయారు చేసే దిశగా ఇది తొలి మెట్టు. రాబోయే రోజుల్లో 'బోయింగ్', 'ఎయిర్‌బస్' వంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ ప్రధాన తయారీ కేంద్రాలను భారత్‌కు మార్చక తప్పని పరిస్థితిని మన ఇంజనీర్లు కల్పిస్తున్నారు.

భారత్ ఇప్పుడు ఆకాశంలో తన ముద్రను సుస్థిరం చేసుకుంది. రేపటి తరం భారత్ తయారు చేసిన విమానాల్లో ప్రయాణించడమే కాకుండా ప్రపంచ విమానయాన రంగానికి దిక్సూచిగా నిలవబోతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu