By - Sathwik |19 May 2026 10:00 AM IST
1,300 పేజీలతో చివరి ఛార్జిషీట్ వేసిన సిట్.. మంత్రి అయ్యాకా పూర్తిగా సహకరించిన జోగి రమేశ్.. 2-3 నెలలకోసారి రూ.3-5లక్షల చొప్పున ముడుపులు
నకిలీ మద్యం తయారీ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన తుది అభియోగపత్రం రాజకీయ, ఆర్థిక, వ్యాపార సంబంధాలపై కీలక అంశాలను వెలుగులోకి తెచ్చినట్లు వెల్లడైంది. గత కొన్నేళ్లుగా సాగిన మద్యం వ్యాపార అనుబంధాలు, భాగస్వామ్యాలు, ఆర్థిక లావాదేవీలు, తరచూ జరిగిన సమావేశాల నేపథ్యంలో ఈ వ్యవహారం కేవలం అక్రమ మద్యం తయారీ వరకే పరిమితం కాలేదని, దీని వెనుక విస్తృత స్థాయి నెట్వర్క్ పనిచేసినట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. నిందితుల మధ్య ఉన్న పరిచయాలు, డబ్బు బదిలీలు, కాల్ రికార్డులు వంటి ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఈ కేసు ఛార్జిషీట్ను కోర్టులో సమర్పించారు.మ గతేడాది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన నకిలీ మద్యం వ్యవహారంలో సిట్, ఎక్సైజ్ అధికారులు సుమారు 1,300 పేజీలతో కూడిన తుది ఛార్జిషీట్ను దాఖలు చేశారు. ఇందులో మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చగా, 89 మందిని సాక్షులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు అక్రమ మద్యం తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు రాజకీయ, వ్యాపార అనుబంధాలను వినియోగించుకున్నట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు వివరించారు. మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా ఇందులో కీలకంగా ప్రస్తావించబడ్డాయి. దర్యాప్తు ప్రకారం, ఇబ్రహీంపట్నం కేంద్రంగా ప్రారంభమైన మద్యం వ్యాపార భాగస్వామ్యాలు కాలక్రమంలో విస్తరించాయి. గతంలో కలిసి బార్లు నిర్వహించిన పరిచయం ఆధారంగా ఈ బంధం మరింత బలపడినట్లు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంబంధాలు మరింత పెరిగాయని, అనంతరం తెలంగాణ నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను తీసుకువచ్చి ఏపీలో విక్రయించే వ్యవహారాలు కూడా సాగినట్లు వివరించారు.
ఇబ్రహీంపట్నంలోని పాత బార్ ప్రాంగణంలో నకిలీ మద్యం తయారీ ప్రారంభమైందని, అక్కడ తయారైన మద్యం వివిధ ప్రముఖ బ్రాండ్ల పేర్లతో విక్రయించబడిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. సీసాల్లో నింపిన నకిలీ మద్యంపై నకిలీ స్టిక్కర్లు అతికించి మార్కెట్లో విక్రయించడం ద్వారా గణనీయమైన లాభాలు పొందినట్లు గుర్తించినట్లు తెలిపారు. అనంతరం ములకలచెరువులో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలను విస్తరించారని వెల్లడించారు. ఇక ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు కూడా కీలక ఆధారాలుగా మారాయి. ప్రధాన నిందితుల నుంచి వివిధ దశల్లో పెద్ద మొత్తంలో నగదు బదిలీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొన్నారు. కొన్ని మొత్తాలు నేరుగా నగదు రూపంలో అందించగా, వ్యాపార సంస్థల ఖాతాల ద్వారా జమ అయినట్లు అధికారులు వివరించారు. బ్యాంక్ లావాదేవీలను పరిశీలించగా కోట్ల అనుమానాస్పద బదిలీలు జరిగినట్లు తేలిందని పేర్కొన్నారు.
అలాగే కాల్ డీటెయిల్ రికార్డులు కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. నిందితుల మొబైల్ టవర్ లొకేషన్లు, పరస్పర కాల్స్, సమావేశాల సమయాలు పరిశీలించగా అనేక సందర్భాల్లో వారు ఒకే ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ ఆధారాలన్నింటినీ కోర్టు ముందుంచారు.

