By - Sathwik |19 May 2026 8:00 AM IST
ఎనిమిదో విజయంతో ప్లే ఆఫ్ బెర్తు ఖాయం... వారి సొంత గడ్డపైనే చెన్నైపై గెలుపు... తొలుత 180 పరుగులు చేసిన చెన్నై
ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ సన్రైజర్స్ హైదరాబాద్ తమ ప్రదర్శనతో మరోసారి బలమైన సందేశం పంపింది. వరుస విజయాలతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ వస్తున్న హైదరాబాద్ జట్టు, కీలక సమయంలో మరింత సమన్వయంతో ఆడి ప్లేఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. చెన్నై వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో అన్ని విభాగాల్లోనూ మెరుగైన ఆటతీరును కనబరిచిన సన్రైజర్స్ ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్కింగ్స్పై విజయం సాధించింది. ఈ విజయంతో హైదరాబాద్ ఖాతాలో ఎనిమిదో గెలుపు చేరగా, ప్లేఆఫ్స్కు అధికారికంగా అర్హత సాధించింది. మరోవైపు చెన్నైకి ఇది ఏడో ఓటమి కావడంతో ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నప్పటికీ పరిస్థితి మాత్రం క్లిష్టంగా మారింది. ముందుగా టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే ఆ జట్టు బ్యాటర్లు ఆరంభంలో వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సంజు శాంసన్ దూకుడైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తొలి ఓవర్లోనే బౌండరీలు, భారీ షాట్లతో పరుగుల వర్షం కురిపించాడు. మరో ఓవర్లో వరుసగా బౌండరీలు సాధించి చెన్నైకి చురుకైన ఆరంభాన్ని అందించాడు. అయితే అతని దూకుడుకు సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్రేక్ వేశాడు. కీలక సమయంలో వికెట్ తీసి ప్రత్యర్థి జోరును తగ్గించాడు. కొద్దిసేపటికే ఉర్విల్ పటేల్ కూడా వెనుదిరగడంతో చెన్నై రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ దశలో రుతురాజ్తో కలిసి కార్తీక్ శర్మ ఇన్నింగ్స్ను నిలబెట్టే బాధ్యత తీసుకున్నాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా కనిపించినా తర్వాత వేగం పెంచి అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు రుతురాజ్ మాత్రం వేగంగా పరుగులు చేయడంలో ఇబ్బందిపడ్డాడు. అతడు క్రీజులో ఎక్కువసేపు నిలిచినా బౌండరీలు సాధించలేకపోయాడు.
బ్రెవిస్ ఇన్నింగ్స్కు కొత్త ఊపు తీసుకొచ్చాడు. చివరి నాలుగు ఓవర్లలో చెన్నై కేవలం 36 పరుగులు మాత్రమే సాధించగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులతో ఇన్నింగ్స్ను ముగించింది. బ్రెవిస్ 44 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, కార్తీక్ శర్మ 32, సంజు శాంసన్ 27 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. సాకిబ్ రెండు వికెట్లు పడగొట్టగా, ఇషాన్ మలింగ ఒక వికెట్ సాధించాడు.
181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్కు ప్రారంభం ఆశించినంతగా లభించలేదు. విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ త్వరగా పెవిలియన్ చేరడంతో ఒత్తిడి పెరిగింది. పవర్ప్లే ముగిసే సమయానికి స్కోరు కూడా పెద్దగా వేగంగా సాగలేదు. అభిషేక్ శర్మ కొంతసేపు వేగంగా ఆడే ప్రయత్నం చేసినా పెద్ద ఇన్నింగ్స్గా మార్చుకోలేకపోయాడు. అయితే మరోవైపు ఇషాన్ కిషన్ క్రీజులో నిలదొక్కుకుని బాధ్యతాయుతంగా ఆడాడు తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ చెన్నై బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. క్లాసెన్ స్టంపౌట్ కావడంతో మ్యాచ్ మరోసారి ఆసక్తికరంగా మారింది. చివరి నాలుగు ఓవర్లలో ఇంకా 38 పరుగులు అవసరమైన దశలో ఇషాన్ కిషన్ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి ఔటైనా అతడు తన బ్యాటింగ్లో ఏమాత్రం తొందరపడలేదు. కీలక సమయంలో బౌండరీ, సిక్సర్తో సమీకరణాన్ని సులభం చేశాడు. చివర్లో ఇషాన్ 70 పరుగుల అద్భుత ఇన్నింగ్స్తో జట్టును విజయానికి చేరువ చేశాడు. అతడు ఔటైన తర్వాత సలీల్ ఆరోరా, స్మరణ్ మిగిలిన పనిని పూర్తి చేసి జట్టుకు కీలక విజయాన్ని అందించారు.

