By - Sathwik |17 May 2026 8:15 AM IST
గుజరాత్ కు కోల్కతా నైట్రైడర్స్ బ్రేకు.. ఈడెన్ గార్డెన్స్లో పరుగుల వరద.. 247 పరుగులు చేసిన కోల్కతా
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హైస్కోరింగ్ పోరులో మరోసారి ఐపీఎల్ ఉత్కంఠభరిత మలుపు తీసుకుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో బరిలోకి దిగిన కోల్కతా నైట్రైడర్స్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్కు గట్టి షాక్ ఇచ్చింది. వరుస విజయాలతో ఆత్మవిశ్వాసంగా కనిపించిన గుజరాత్ను 29 పరుగుల తేడాతో ఓడించి కేకేఆర్ తన అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. ఈ విజయంతో కోల్కతా అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించగా, ప్లేఆఫ్స్కు తొలి జట్టుగా అర్హత సాధించాలని భావించిన గుజరాత్కు మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. టాస్ కోల్పోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించింది. ఫిన్ అలెన్ మొదటి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కెప్టెన్ అజింక్య రహానే మరోసారి ఆశించిన స్థాయిలో ఆడలేక త్వరగా వెనుదిరిగినా, అది జట్టుపై ఎలాంటి ప్రభావం చూపలేదు. మూడో స్థానంలో వచ్చిన ఆంగ్క్రిష్ రఘువంశీ అలెన్కు అద్భుతమైన సహకారం అందించాడు. సాధారణంగా కాస్త నెమ్మదిగా ఆడే రఘువంశీ ఈసారి పూర్తిగా దూకుడు ప్రదర్శించి భారీ షాట్లతో అలరించాడు.
గుజరాత్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా అలెన్ను నియంత్రించలేకపోయారు. ముఖ్యంగా అతనికి లభించిన ఒక కీలక జీవనదానం మ్యాచ్ దిశనే మార్చేసింది. అప్పటికే మంచి టచ్లో ఉన్న అలెన్ ఆ అవకాశం దక్కిన తర్వాత మరింత ప్రమాదకరంగా మారాడు. రషీద్ ఖాన్ బౌలింగ్లో వరుసగా భారీ షాట్లు బాదుతూ పరుగుల వర్షం కురిపించాడు. కేవలం 21 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన అతను ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. అతని 93 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ జట్టుకు భారీ పునాది వేసింది.
అలెన్ అవుటైన తర్వాత కూడా కోల్కతా దూకుడు ఏమాత్రం తగ్గలేదు. రఘువంశీ మరింత దూకుడుగా మారి సిక్సర్ల వర్షం కురిపించాడు. మరోవైపు కామెరూన్ గ్రీన్ కూడా మొదటి నుంచే వేగంగా ఆడుతూ గుజరాత్ బౌలింగ్ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోరును మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. చివరి ఓవర్లలో ఇద్దరూ భారీ షాట్లతో విజృంభించడంతో కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభంలోనే ఒక చిన్న ఇబ్బందిని ఎదుర్కొంది. సాయి సుదర్శన్ మంచి షాట్లతో జట్టుకు ఊపు తీసుకువస్తున్న సమయంలో గాయంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగాల్సి వచ్చింది. నిశాంత్ సింధు త్వరగా అవుటవడంతో గుజరాత్పై ఒత్తిడి పెరిగింది. కెప్టెన్గిల్ క్రీజులో నిలబడి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్లో జోస్ బట్లర్ కూడా అతనికి అండగా నిలిచాడు. మొదట కాస్త నెమ్మదిగా ఆడిన గిల్ ఆ తర్వాత వేగం పెంచి భారీ షాట్లు బాదడం ప్రారంభించాడు. ముఖ్యంగా నరైన్, అనుకుల్ బౌలింగ్లపై అతను సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బట్లర్ కూడా క్రమంగా గేర్ మార్చి పరుగుల వేగాన్ని పెంచాడు. ఇద్దరూ కలిసి గుజరాత్ను మళ్లీ పోటీలోకి తీసుకొచ్చారు. 16 ఓవర్ల ముగిసే సమయానికి గుజరాత్ విజయం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించింది. కానీ మ్యాచ్ కీలక దశలో సునీల్ నరైన్ తన అనుభవాన్ని చూపించాడు. ప్రమాదకరంగా మారిన గిల్ను అవుట్ చేయడంతో పాటు అత్యంత కీలక ఓవర్లో పరుగులను నియంత్రించాడు.

